తెలుగు రాష్ట్రాల వైపు బిర బిర పరుగులు తీస్తోన్న కృష్ణమ్మ
కర్ణాటక నుండి కృష్ణమ్మ బిర బిర పరుగులు పెడుతోంది. భారీగా కృష్ణమ్మ వచ్చే అవకాశం ఉందని కర్ణాటక అధికారులు ఉభయ రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేశారు.
మహబూబ్నగర్: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదవికి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం కూడ తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వచ్చే రెండు రోజుల్లో కృష్ణా నదికి భారీగా ఇన్ఫ్లో ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.
కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. వచ్చే రెండు రోజుల్లో ప్రతి రోజూ 4 నుండి 5 లక్షల క్యూసెక్కుల నీరు జూరాలకు వచ్చే అవకాశం ఉంది.
ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి మంగళవారం నాడు నీటిని విడుదలను పెంచారు. జూరాలకు భారీగా కృష్ణా నదికి భారీగా వరద వచ్చే అవకాశం ఉంది. జూరాలకు ఎగువన ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం నాడు ఈ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో 2.82 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దిగువకు 1.06 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు.
మంగళవారం సాయంత్రానికి ఆల్మట్టిలోకి 3.13 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువకు 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది.జూరాలకు వచ్చిన నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
ఈ రెండు రోజుల్లో భారీగా వరద వచ్చే అవకాశం ఉందని కర్ణాటకకు చెందిన అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాల అధికారులను హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇన్ఫ్లో ఇలానే కొనసాగితే రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి సాగర్ కూడ నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.