ఆస్తి వివాదం: మహిళను కాలితో తన్నిన ధర్పల్లి ఎంపీపీ
మహిళపై దాడి చేసిన ఎంపీపీ
నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎంపీపీ ఓ మహిళను కాలితో తన్నాడు. ఓ ఇంటి రిజిస్ట్రేషన్ విషయమై స్థానికంగా ఉన్న రాజవ్వ అనే మహిళ కుటుంబానికి, ఎంపీపీ ఇమ్మడి గోపికి మధ్య గొడవ జరుగుతోంది. ఈ తరుణంలో ఆదివారం నాడు ఎంపీపీ గోపి మహిళను కాలితో తన్నాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఓ ఇల్లు విక్రయం విషయంలో ఓ కుటుంబానికి, ఎంపీపీకి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఎంపీపీ ఇమ్మడి గోపీ ఓ మహిళను కాలితో తన్నాడు.స్థలం రిజిస్ట్రేషన్ తర్వాత ఎంపీపీ గోపీ అదనంగా డబ్బులు అడిగాడని బాధితురాలైన గౌరారం వాసి రాజవ్వ చెబుతున్నారు.
దీంతో బాధితురాలు తమ బంధువులతో ఎంపీపీ ఇంటి ముందు ఆదివారం నాడు నిరసనకు దిగింది. ఎంపీపీతో వారు వాగ్వాదానికి దిగారు. ఇంటిని విక్రయించి కూడ ఇల్లును తమకు అప్పజెప్పకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధిత కుటుంబం చెబుతోంది. రూ.65 లక్షలకు ఇంటిని విక్రయించినట్టు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన తర్వాత ఇంటిని తమకు అప్పగించకుండా మరో రూ.15 లక్షలు ఇవ్వాలని బాధితులను ఎంపీపీ గోపి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై రెండు వర్గాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ గోపి ఇంటి ముందు బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. ఈ విషయమై బాధితురాలు రాజవ్వ ఎంపీపీతో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు ఆగ్రహం పట్టలేక చెప్పుతో కొట్టింది. వెంటనే ఎంపీపీ గోపి కాలితో రాజవ్వను తన్నాడు. బాధితురాలు రాజవ్వ కిందపడిపోయింది.దీంతో రాజవ్వ కుటుంబసభ్యులు ఎంపీపీ గోపిని నెట్టివేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.