రాంకీ గ్రూప్లో సోదాలు.. దొరికింది ఎంతంటే, వివరాలతో ఐటీ శాఖ ప్రెస్ నోట్
రాంకీ గ్రూప్ కంపెనీలపై గత మంగళవారం నిర్వహించిన సోదాలకు సంబంధించి ఐటీ శాఖ ప్రెస్ నోట్ విడుదల చేసింది. తనిఖీల వివరాలతో పాటు డాక్యుమెంట్లు, నగదు స్వాధీనంపై క్లారిటీ ఇచ్చింది
వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్పై ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనిఖీలు, ఇతర వివరాలతో కూడిన ప్రెస్ నోట్ను ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ సోదాల్లో రూ.1200 కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అలాగే దాదాపు రూ.300 కోట్ల లెక్కలు లేని నగదు గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
రాంకీ సంస్థ ఉద్దేశపూర్వకంగానే నష్టాలను చూపెట్టిందని ఐటీ శాఖ ఆరోపించింది. రూ.1200 కోట్లు కృత్రిమ నష్టాన్ని చూపిందని తెలిపింది. రాంకీలోని మేజర్ వాటాను సింగపూర్కు చెందిన వ్యక్తులకు అమ్మేశారని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. తప్పుడు లెక్కలు చూపించి రూ.300 కోట్లు పన్ను ఎగవేసేందుకు యత్నించినట్లుగా గుర్తించామని పేర్కొంది. అంతేకాకుండా రూ.288 కోట్లకు సంబంధించిన పత్రాలను నాశనం చేసిందని ఐటీ శాఖ తెలిపింది. రాంకీ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లతో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ తదితర రంగాల్లో ప్రాజెక్ట్ చేపట్టిందని వెల్లడించింది.
Also Read:వైసీపీ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు: అయోధ్య రాంరెడ్డి సంస్థల్లో 15 చోట్ల తనిఖీలు
మరోవైపు రాంకీ సంస్థపై ఐటీ సోదాల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సెబి ఇచ్చిన సమాచారంతోనే ఐటీ సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. గత మంగళవారం హైదరాబాద్లోని రాంకీ కంపెనీ కార్యాలయాల్లో ఐటీ శాఖ 20 చోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొంతకాలం నుంచి రాంకీ షేర్ విలువ అనూహ్యంగా పెరిగింది. దీనిపై సెబీ నిఘా పెట్టింది. కంపెనీలో జరుగుతున్న పరిణామాలపై సెబీ అంతర్గత విచారణ చేపట్టింది. రాంకీ షేర్స్ విలువ పెరగడంపై షోకాజ్ నోటీసులు ఇచ్చింది సెబీ. మలేషియాకు చెందిన కంపెనీకి నిధులు మళ్లీంచినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.