భర్త అనుమానం... భార్య ప్రాణాలు తీసింది.
కట్టుకున్న భార్యను ప్రేమగా చూడాల్సిందిపోయి... అనుమానం పెంచుకున్నాడు. వేరెవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపణలు చేశాడు. అనంతరం ఆమెను కిరాతకంగా హత్య చేశాడు.
కట్టుకున్న భార్యను ప్రేమగా చూడాల్సిందిపోయి... అనుమానం పెంచుకున్నాడు. వేరెవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపణలు చేశాడు. అనంతరం ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన పాల్వంచలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... పట్టణంలోని సీతారాంపట్నం ఏరియా చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కందుకూరి శివ 15 సంవత్సరాల క్రితం భద్రాచలానికి చెందిన మేనకోడలు అరుణ (32)ను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు వారి సంసారం సాఫీగా సాగింది. సంవత్సర కాలంగా భార్య అరుణను అనుమానించడం మొదలు పెట్టాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతున్నావంటూ వేధిస్తున్నాడు. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా చేశారు. అయినా మార్పు రాలేదనే కక్షతో రగిలిపోయాడు.
గురువారం అర్ధరాత్రి 2గంటల సమయంలో భార్య నిద్రిస్తుండగా కర్రతో తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె తల, ముఖం తీవ్రంగా పగిలి రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే శివ పరారయ్యాడు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బతండా గ్రామంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ధర్మారంతండా గ్రామానికి చెందిన బారోతు మాలు కుమార్తె స్వాతిబాయి (22)కి, దుబ్బతండా గ్రామానికి చెందిన భూక్యా శ్రీనివాస్తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా భర్త శ్రీనివాస్కు వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చారు.
శ్రీనివాస్ మద్యానికి బానిసై తరచూ స్వాతిబాయిని అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడు. దీనిపై ఇరువురి తల్లిదండ్రుల సమక్షంలో గతంలో పంచాయతీలు జరిగాయి. అయినా తీరు మార్చు కోని శ్రీనివాస్ అదనపు కట్నం తీసుకురావాలని గురువారం రాత్రి గొడవ పడటంతో తీవ్ర మనస్తాపం చెందిన స్వాతి ఇంట్లోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
తమ కుమార్తెను అల్లుడే చంపి... ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు స్వాతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.