కొత్త వేరియంట్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు
ప్రపంచ దేశాల్లో ఒమ్రికాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఒక వేళ తెలంగాణలో కొత్త వేరియంట్ కేసులు వస్తే దానిని ఎదుర్కొవడానికి ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు అన్ని దేశాలను భయపెడుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటన్న సమయంలో దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమ్రికాన్ వేరియంట్ వల్ల మళ్లీ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే మొదటి వేవ్, రెండో వేవ్ కరోనా వేవ్ల వల్ల ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా చాలా నష్టపోయాయి. ఇప్పుడు కొత్త వేరియంట్ వల్ల ఎలాంటి పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నాయి. ఈ ఒమ్రికాన్ను అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాయి.
ఇండియాలో రెండు కేసులు గుర్తింపు..
ఒమ్రికాన్ వేరియంట్ ఇండియాలోకి కూడా ప్రవేశించింది. గురువారం రెండు కేసులు గుర్తించనట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొత్త వేరియంట్ ఇతర దేశాల్లో విస్తరిస్తున్న సమయంలోనే భారత ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇండియాలోకి కొత్త వేరియంట్ వస్తే దానిని ఎదుర్కొవాడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
అలెర్ట్గా ఉన్న తెలంగాణ ప్రభుత్వం..
ప్రపంచ దేశాల్లో ఒమ్రికాన్ విస్తరణ, కేంద్ర ప్రభుత్వ సూచనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఒక వేళ కొత్త వేరియంట్ రాష్ట్రంలోకి వస్తే దానిని ఎదుర్కొవడానికి, కట్టడికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటోంది. అందులో భాగంగా వెంటిలేటేడ్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ను సిద్ధంగా ఉంచుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజుకు దాదాపు 140 నుంచి 150 కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇవన్నీ డెల్టా రకానికి చెందినవి. అయితే ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన ఒక మహిళలకు కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఆమె నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలో కొత్త వేరియంట్ ప్రవేశిస్తే, దాని చికిత్స కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. టిమ్స్లో 25 వెంటిలేటెడ్ బెడ్స్, 175 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశారు. అలాగే గాంధీ హాస్పిటల్ లో 100 బెడ్స్ను సిద్ధంగా ఉంచారు. అలాగే మరికొన్ని హాస్పిటల్స్లో ఐసీయూ వార్డుల, ఆక్సిజన్ సిలెండర్స్, వెంటిలేటర్ బెడ్స్ సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. కొత్త వేరియంట్ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుకుంటున్నారు.
రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు..
కొత్త వేరియంట్ బయటపడిన దేశాల నుంచి తెలంగాణకు వచ్చే వారందరికీ విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఐదేళ్లు పైబడిన వారందరికీ ఈ టెస్ట్ తప్పనిసరి చేశారు. ఇందులో పాజిటివ్గా నిర్ధారించబడిన వారందరినీ క్వారంటైన్కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రిస్క్ దేశాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కూడా థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్లో, అలాగే థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినప్పటికీ వారందరూ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రిస్క్ లేని దేశాల నుంచి వచ్చే వారిలో కూడా అనుమానితులను గుర్తించి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాస్పిటల్స్కు తీసుకెళ్లనున్నారు.