Free Bus: ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎంతమంది ప్రయాణిస్తున్నారో తెలుసా?
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లో 3 కోట్ల మంది ప్రయాణికులు జీరో టికెట్ తీసుకున్నారు.
![in 11 days 3 crore zero tickets issued as mahalakshmi scheme rolled up kms in 11 days 3 crore zero tickets issued as mahalakshmi scheme rolled up kms](https://static-ai.asianetnews.com/images/01hhahh7aatwgdc0bgrjj6zf90/ga1lu0cayaa7nfw-jpg_363x203xt.jpg)
Free Bus: ఒకప్పుడు ఆర్టీసీ అప్పుల్లోకి వెళ్లుతున్నదని, ప్రైవేటుపరం అవుతున్నదనే వార్తలు ఎక్కువగా వచ్చేవి. బస్సులు రావడం లేదని, బస్సుల సంఖ్య తగ్గిపోతున్నదనే వార్తలూ ఉండేవి. ఆక్యుపెన్సీ తగ్గుతున్నదని, లాభాలు రావడం లేదనే వాదనలు ఎక్కువగా వినిపించేవి. కానీ, నేడు తెలంగాణ ఆర్టీసీ గురించిన వార్తలన్నీ.. మహాలక్ష్మీ పథకం చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం తర్వాత ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు గణనీయంగా పెరిగారు. ప్రైవేటుపరం కాదు కదా... కొత్త బస్సులను ప్రవేశపెట్టే ఆలోచనలను టీఎస్ఆర్టీసీ ఆలోచిస్తుండటం గమనార్హం.
మహాలక్ష్మీ పథకం తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అనేక ఛలోక్తులు వస్తున్నాయి.
ఇంతకీ ఈ పథకం ద్వారా ఎంత మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు? అనే ఆసక్తి కూడా మరో వైపు ఏర్పడింది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లో 3 కోట్లకు పైగా జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది. అంటే రోజుకు 30.51 లక్షల మహిళలు ప్రయాణించారు. అంటే.. మొత్తం ప్రయాణికులలో 61 శాతం మహిళా ప్రయాణికులే ఉన్నారు. ఈ దెబ్బతో బస్సు ఆక్యపెన్సీ కూడా గణనీయంగా పెరిగింది. టీఎస్ఆర్టీసీ ఆక్యుపెన్సీ 69 శాతం ఉంటే.. నేడు ఇది 88 శాతానికి పెరిగింది.
Also Read: 2024 Elections: ప్రధాని మోడీపై వారణాసి నుంచి విపక్ష కూటమి నుంచి పోటీ చేసేది ఎవరు?
ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్న మహిళలకు వారి గుర్తింపు కార్డులను చూసి కండక్టర్లు జీరో టికెట్లను జారీ చేస్తున్నారు.
రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. క్రిస్మస్, సంక్రాంతి, వేసవి సెలవులు వస్తున్న తరుణంలో మహిళా ప్రయాణికుల సంఖ్య ఇంకా గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో మరో 1,050 కొత్త డీజిల్ బస్సులను (ఏసీ,పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు) ప్రవేశపెట్టాలని టీఎస్ఆర్టీసీ అనుకుంటున్నది.