విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు: భారీ వర్షాలు

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు గురువారం నాడు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు కూడ జారీ చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలకు వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ ప్రకటించింది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.


నేటి నుంచి 12వ తేదీ వరకు కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఐఎండీ హెచ్చరికలకు స్పందించిన కేంద్రం అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. గురు, శుక్రవారాల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రమంతా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. రుతుపవనాలకు ఉపరితల ద్రోణి తోడవటంతో ఉత్తరాంధ్రలోనూ ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.


నైరుతి రుతుపవనాలు గురువారం తెలంగాణలో ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం నాటికి రాయలసీమ నుంచి తెలంగాణ రాష్ట్రం సరిహద్దు మీదుగా దక్షిణ కోస్తాంధ్ర మొత్తం విస్తరించినట్లు వెల్లడించింది. గురువారం సాయంత్రానికి రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే సూచనలున్నట్లు చెప్పింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల తేమ గాలులు వీస్తున్నాయి.