బిర్యానీ తింటుండగా అందులో గొంగళిపురుగును గుర్తించాడు. వెంటనే దాన్ని ట్విట్టర్ ద్వారా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్తోపాటు మీడియాకు తెలిపాడు.
హైదరాబాద్ లో నెల రోజుల క్రితం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఐకియా స్టోర్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఆ స్టోర్ లోని ఫుడ్కోర్టులో శాఖాహార బిర్యానీలో గొంగళిపురుగు వచ్చిన ఘటన కలకలం సృష్టించింది. బాధితుడు సామాజిక మాధ్యమం ద్వారా చేసిన ఫిర్యాదుకు స్పందించి జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించి నిర్వాహకులకు రూ.11,500 జరిమానా విధించారు.
వివరాల్లోకి వెళ్తే.... నగరానికి చెందిన అబీద్ అహ్మద్ అనే వ్యక్తి శనివారం ఐకియా ఫుడ్కోర్టులో శాఖాహార బిర్యానీ తింటుండగా అందులో గొంగళిపురుగును గుర్తించాడు. వెంటనే దాన్ని ట్విట్టర్ ద్వారా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్తోపాటు మీడియాకు తెలిపాడు. దీంతో వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు సదరు ఫుడ్కోర్టులో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా అక్కడ 50 మైక్రాన్లకన్నా తక్కువ మందంగల నిషేధిత ప్లాస్టిక్ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే వారు ఫుడ్కోర్టు మేనేజర్కు నోటీసులు జారీచేయడంతో పాటు రూ.11500 జరిమానా విధించారు. అలాగే, ఐకియాకు బిర్యానీ సరఫరా చేస్తున్న నాగపూర్కు చెందిన హల్దీరామ్ సంస్థకు కూడా నోటీసులు జారీ చేశారు. మరోవైపు, అనుకోని విధంగా జరిగిన ఈ సంఘటనకు తాము చింతిస్తున్నట్లు ఐకియా ప్రకటించింది. దీనిపై అధ్యయనం నిర్వహించి లోపాలను సరిచేసుకుంటామని ఐకియా ప్రతినిధులు ప్రకటించారు.
