వ్యాక్సిన్ వేసుకోకపోతే జీతం రాదు..కరెంట్ ఉండదు- వ్యాక్సినేషన్ లో వేగం పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం..
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. కరెంట్ కట్ చేస్తామని, జీతాలు ఇవ్వబోమని చెబుతోంది.
దేశంలో ఓమ్రికాన్ వేరియంట్ ప్రభావం మెల్ల మెల్లగా పెరుగుతోంది. తెలంగాణలో కూడా ఈ వైరస్ ప్రభావం ఇప్పటికైతే లేదని, కానీ మున్ముందు వచ్చే సూచనలు ఉన్నాయని ఇటీవల పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు చెప్పారు. కొత్త వేరియంట్ తెలంగాణలో తన ప్రభావం చూపకముందే ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకొని వారి ఇంటికి కరెంట్ కట్ చేస్తామని హెచ్చరిస్తోంది. అలాగే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పిస్తేనే జీతం వేస్తామంటూ కొన్ని శాఖల్లో ఈ నిబంధనను అమలు చేస్తోంది.
మొన్న రేషన్... ఇప్పుడు కరెంట్
దక్షిణాఫ్రికాలో ఓమ్రికాన్ వేరియంట్ను గుర్తించారు. ఇది మెల్లగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇది మన దేశంలోకి కూడా ప్రవేశించింది. ప్రతీ రోజు పలు రాష్ట్రాల్లో కొన్ని కేసులు గుర్తిస్తున్నారు. తెలంగాణకు కూడా ఈ ముప్పు పొంచి ఉంది. ఇటీవల ఓమ్రికాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు. ఎయిర్ పోర్టులోనే వారికి పరీక్షలు నిర్వహించిన సమయంలో వారికి కరోనా ఉందని రుజువైంది. అయితే వారికి ఓమ్రికాన్ వేరియంట్ సోకిఉండవచ్చనే అనుమానం తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురి చేసింది. వారి నుంచి సేకరించిన శాంపుల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. నిన్న వచ్చిన ఫలితాల్లో వారికి సోకింది ఓమ్రికాన్ కాదని నిర్ధారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఒక వేళ కరోనా తెలంగాణలో వస్తే దాని ప్రభావానికి రాష్ట్ర ప్రజలు గురికాకూడదనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ డిసెంబర్ చివరి నాటికి మొదటి డోసు 100 శాతం ప్రజలకు ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే మొదటి డోసు 92 శాతం మందికి ఇచ్చారు. రెండో డోసు కూడా ఈ డిసెంబర్ నాటికి 60 శాతానికి పైగా జనాభాకు ఇచ్చేయాలని చూస్తోంది. ఇలా చేయడం వల్ల ప్రజల్లో హెర్ద్ ఇమ్యూనిటీ, హైబ్రీడ్ ఇమ్యూనిటీ వస్తుందని దీంతో కరోనాను సులువుగా ఎదుర్కొవచ్చని చూస్తోంది.
వ్యాక్సినేషన్ స్పీడ్ అప్ చేయాలని ఉద్దేశంతో కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది. అందులో భాగంగా వివిధ జిల్లాల్లో వివిధ ప్లాన్లను అమలు చేస్తోంది. నిజామాబాద్ వంటి ప్రాంతంలో రేషన్ కట్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎవరెవరు మొదటి డోసు, రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు ? ఇంకా ఎవరు తీసుకోలేదు వంటి వివరాలను రేషన్ డీలర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోకపోతే బియ్యం ఇవ్వబోమనే సాంకేతాలు వారి నుంచి పంపిస్తున్నారు. ఇప్పుడు అదే దారిలో కరోనా టీకా వేసుకోకపోతే కరెంట్ కట్ చేస్తామని, జీతం ఇవ్వబోమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే టెస్కాబ్ సంస్థ ఒక ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే జీతాలు అకౌంట్లో వేస్తామని తేల్చి చెప్పింది.
https://telugu.asianetnews.com/coronavirus-telangana/government-ready-to-face-omricon-telangana-public-health-director-srinivas-rao-r3n98t
అలాగే సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో వ్యాక్సినేషన్కు నిరాకరించిన పలువురి ఇళ్లకు కరెంట్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. వ్యాక్సిన్ ఇచ్చేందుకు వచ్చిన వారిని వారించి తాము టీకా తీసుకోబోమని కొందరు తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, అలా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తరువాత వారు టీకాకు తీసుకుంటామని చెప్పడంతో కరెంట్ సరఫరా పునరుద్దరించారు.