నాగం ఎఫెక్ట్: అందుకే టిఆర్ఎస్లోకి: ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
టిఆర్ఎస్లో చేరేందుకు దామోదర్ రెడ్డి రెడీ
నాగర్కర్నూల్: తాను వ్యతిరేకించినా మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలో
చేర్చుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఎమ్మెల్సీ
కూచకుళ్ళ దామోదర్ రెడ్డి చెప్పారు.
గురువారం నాడు
దామోదర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలో
చేర్చుకోవద్దని తాను పార్టీ నాయకత్వానికి పలు మార్లు విన్నవించినా ఫలితం
లేకుండాపోయిందన్నారు. తన అభ్యంతరాలను పార్టీ నాయకత్వం
పట్టించుకోలేదన్నారు. పార్టీలో తన మాటకు విలువ లేని సమయంలో పార్టీ కొనసాగడం
వల్ల తనకు న్యాయం జరుగుతోందనే నమ్మకం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. ఈ
కారణంగానే కాంగ్రెస్ పార్టీనుండి బయటకు వెళ్ళాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన
చెప్పారు. త్వరలోనే టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు దామోదర్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని ఎంపీ నందిఎల్లయ్య తనను పలుమార్లు కోరినట్టు ఆయన
గుర్తు చేశారు. కానీ, పార్టీలో తాను కొనసాగే పరిస్థితులు లేవన్నారు. ఈ కారణాలతోనే తాను
పార్టీని వీడాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా దామోదర్ రెడ్డి చెప్పారు. 20 ఏళ్ళుగా తను
నమ్ముకొన్న అనుచరులను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే తాను పార్టీ మారాలనే నిర్ణయ
తీసుకొన్నట్టు దామోదర్ రెడ్డి చెప్పారు.