వైఎస్ఆర్ వర్ధంతి సభకు వెళ్తున్నా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ నిర్వహించే ఆత్మీయ సమావేశానికి తాను హాజరౌతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి తాను వెళ్తున్నట్టుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.ఈ సమావేశానికి ఎవరూ కూడా వెళ్లోద్దని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఈ మేరకు ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.
వైఎస్ఆర్ సంస్మరణ సభకు తనకు ఆహ్వానం అందిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశానికి తాను హాజరుకానున్నట్టుగా ఆయన తేల్చి చెప్పారు.వైఎస్ఆర్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని తాను ఈ సమావేశానికి వెళ్తున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశం రాజకీయాలకు అతీతమని ఆయన అభిప్రాయపడ్డారు.
వైఎస్ఆర్ తో సన్నిహితంగా మెలిగిన సుమారు 300 మందికి ఈ సమావేశానికి విజయమ్మ ఆహ్వానాలు పంపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు పార్టీల్లోని నేతలకు విజయమ్మ ఆహ్వానాలు పంపింది. అయితే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి ఎవరెవరు హాజరౌతారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.