తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స : కేసీఆర్ ఆరోగ్యంపై యశోదా ఆసుపత్రి హెల్త్ బులెటిన్ .. డాక్టర్లు ఏమన్నారంటే
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్ధితిపై శనివారం యశోదా ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా వుందని, ఆయనను నిత్యం నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిపారు.
![hyderabad yashoda hospital doctors released health bulletin on ex telangana cm and brs chief kcr health condition ksp hyderabad yashoda hospital doctors released health bulletin on ex telangana cm and brs chief kcr health condition ksp](https://static-ai.asianetnews.com/images/01hgq3bvksxzjptgny3d5dhdy8/cm-kcr_363x203xt.jpg)
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్ధితిపై శనివారం యశోదా ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా వుందని, ఆయనను నిత్యం నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిపారు. బెడ్ మీద నుంచి లేచి కేసీఆర్ నడవగలుగుతున్నారని.. ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ నడుస్తున్నారని యశోదా డాక్టర్లు పేర్కొన్నారు.
అంతకుముందు కేసీఆర్కు శుక్రవారం సాయంత్రం విజయవంతంగా హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ (తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స ) నిర్వహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యశోద హాస్పిటల్స్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో సర్జరీ విజయవంతంగా పూర్తయ్యిందని, ఐవీ ఫ్లూయిడ్స్, ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్, పెయిన్ మెడిసిన్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన ఆరు నుంచి ఎనిమిది వారాల్లో పూర్తిగా కోలుకుంటారని తెలిపారు.
కాగా.. సర్జరీ పూర్తయిన అనంతరం పూర్తిగా విశ్రాంతి తీసుకున్న మాజీ సీఎం కేసీఆర్ శనివారం ఉదయం నడిచేందుకు ప్రయత్నించారు. ఆయనను వాకర్ సాయంతో డాక్టర్లు మెళ్ల మెళ్లగా నడపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విడుదలైంది. దీంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
ఇకపోతే.. గురువారం రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్లో కేసీఆర్ కాలుజారి పడిపోయారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్యుల బృందం పలు పరీక్షలు నిర్వహించి తుంటి ఎముక విరిగినట్లుగా గుర్తించి శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్ధితిపై ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. అటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్ధితిని పర్యవేక్షించి, మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ యశోదా ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు.