తెలంగాణో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా సాగుతున్నదని తెలిపింది.
హైదరాబాద్: మొన్నటి వరకు వర్షాలు దంచికొట్టాయి. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. చాలా చోట్ల వరదలు ముంచెత్తాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లు, రోడ్లు ధ్వంసమైపోయాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంది. కానీ, రోజలు వ్యవధిలోనే వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని జిల్లాల్లో ఇప్పుడు మళ్లీ వేసవిని తలపించే ఎండలు కొడుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అంచనా వేసింది.
వచ్చే మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. ఇది స్థిరంగా కొనసాగుతున్నట్టు తెలిపింది. అందుకే వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వివరించింది.
Also Read: ఈ నెల 19, 20 తేదీల్లో రెండు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
శనివారం రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడ్డాయి. నల్గొండ జిల్లా ఘన్ పూర్లో 71 మిల్లి మీటర్ల మేరకు, యాదాద్రి జిల్లా నందనంలో 53 మిల్లీ మీటర్ల మేరకు, ఖమ్మం జిల్లా లింగాలలో 43 మిల్లీ మీటర్ల మేరకు, రావినూతల, తిమ్మారావు పేటలలో 42 శాతం మేరకు, మధిరలో 39 మిల్లీ మీటర్ల మేరకు, రంగారెడ్డి జిల్లా బోడకొండలో 39 మిల్లీ మీటర్ల మేరకు వర్షాపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది.
