గ్రేటర్ పరిధిలో విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. మెట్రో కాంబి టికెట్ ధర తగ్గింపు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో కాంబి టికెట్ ధరను తగ్గిస్తున్నట్టుగా తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో కాంబి టికెట్ ధరను తగ్గిస్తున్నట్టుగా తెలిపింది. ప్రస్తుతం రూ. 20గా ఉన్న స్టూడెంట్ మెట్రో కాంబి ధరను రూ. 10కి తగ్గించినట్టుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో స్టూడెంట్ బస్ పాస్లు ఉన్న విద్యార్థులు.. ఆర్డినరీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు అనుమతిస్తారు. అయితే బస్సు పాస్ కలిగిన విద్యార్థులు.. ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు కాంబి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణించిన ప్రతిసారి కూడా కాంబి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే గతంలో మెట్రో కాంబి టికెట్ ధర రూ. 10గా ఉండగా.. ఈ ఏడాది ప్రారంభంలో దీనిని రూ. 20కి పెంచారు. గతంలో మెట్రో కాంబి రేటు రూ. 10గా ఉన్నప్పుడు ఎక్కువ మంది వినియోగించుకునే వారు. అయితే మెట్రో కాంబి టికెట్ ధర పెంచడం వల్ల.. ఆ టికెట్ల విక్రయాలు తగ్గిపోయాయి. మరోవైపు ఆర్డినరీ బస్సులలో రద్దీ పెరిగిపోయింది. చాలా మంది రూ. 20లకు మెట్రో కాంబి టికెట్ తీసుకోవడానికి బదులు, కష్టమైన ఆర్డినరీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలోనే మెట్రో కాంబి ధరను తగ్గించాలని విద్యార్థులు కోరుతున్నారు. అయితే ఈ పరిణామాలను పరిశీలించిన ఆర్టీసీ అధికారులు మెట్రో కాంబి టికెట్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ సర్వీసుల్లో రద్దీని తగ్గించేందుకే ఇలా చేశామని అధికారులు చెబుతున్నారు.
ఇక, ఇటీవల కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ బస్సు పాస్తో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్గా నడిచే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించడానికి ఆర్టీసీ అధికారులు అనుమతి ఇచ్చారు. విద్యార్థుల రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ సదుపాయాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోగలరని సూచించారు.