యూ ట్యూబ్ లో చూసి 38 వాహనాలు దొంగతనం...
యూట్యూబ్ లో చూసి టూ వీలర్స్ ను దొంగిలిస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మెట్రో రైల్ స్టేషన్ల నుంచి దగ్గరి ప్రాంతాలకు వెళ్లడానికి ప్రవేశపెట్టిన వోగో కంపెనీ యాక్టివా వెహికిల్స్ ను దొంగిలిస్తుందో ముఠా.
యూట్యూబ్ లో చూసి టూ వీలర్స్ ను దొంగిలిస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మెట్రో రైల్ స్టేషన్ల నుంచి దగ్గరి ప్రాంతాలకు వెళ్లడానికి ప్రవేశపెట్టిన వోగో కంపెనీ యాక్టివా వెహికిల్స్ ను దొంగిలిస్తుందో ముఠా.
ఈ గ్యాంగ్ సభ్యులు యూట్యూబ్ లో చూసి జీపీఎస్ పరికరాలను ఎలా తొలగించాలో నేర్చుకున్నారు. దీంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. బుధవారం కమీషనర్ అంజనీకుమార్, అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి ఈ కేసు వివరాలను వెల్లడించారు.
పాతబస్తీ భవానీనగర్, యాకుత్ పురా ప్రాంతాలకు చెందిన మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ యాసీన్, మీర్ హంజాలు ఇంటర్ చదువుతున్నారు. వీరు వోగో వాహనాలను యాప్ ద్వారా అద్దెకు తీసుకోవచ్చని, ఇంజిన్ ఆన్ ఆయితేనే దాని జీపీఎస్ స్టార్ట్ అవుతుందని రిజ్వాన్ గుర్తించాడు.
ఈ విషయాన్ని తన స్నేహితులిద్దరితో చెప్పాడు. వోగో వెహికిల్స్ అన్నీ యాక్టివా 5జీలే కావడంతో వీటిని దొంగిలిద్దామని ప్లాన్ వేశారు. చిక్కడపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, అబిడ్స్ ఠాణాల పరిధిలో ఉన్న మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ప్లేసుల్లో ఉండే వోగో వాహనాలను టార్కెట్ చేశారు.
నాలుగు నెలల్లో 38 వాహనాలను దొంగిలించారు. వాటిమీద ఉన్న వోగో స్టిక్కర్స్ ను తీసేసి, హ్యాండిల్ లాక్ సెట్ చేసి, నకిలీ తాత్కాలిక రిజిస్ట్రేషన్ పేపర్స్ తయారు చేసేవాళ్లు.
వీటితో ఈ దొంగలించిన వాహనాలను సయ్యద్ అహ్మద్ మెహేదీ, ఎజాజ్, నోయన్, వజీద్ల ద్వారా వేరేవాళ్లకు అమ్మేవారు. వాహనాల దొంగతనం మీద సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఎస్. రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్పైలు ఎన్. శ్రీశైలం, మహ్మద్ థకీయుద్దీన్, వి.నరేందర్, కె.చంద్రశేఖర్లు వలపన్ని నిందితులను పట్టుకున్నారు. మెహేదీ, ఎజాజ్, నోమన్ మినహా నలుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్దనుండి దొంగిలించిన 38 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.