బొగ్గు గనుల వేలం: రాష్ట్ర అభివృద్దిని అడ్డుకునే కుట్ర.. కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్
Hyderabad: సింగరేణిని ప్రయివేటీకరించబోమని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్... ఎస్సీసీఎల్ కు చెందిన నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తామని కేంద్రం లోక్ సభలో ప్రకటించడంపై మండిపడ్డారు.
Singareni Coal Mines: సింగరేణి బొగ్గు గనులను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని ప్రయివేటీకరించబోమని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్... ఎస్సీసీఎల్ కు చెందిన నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తామని కేంద్రం లోక్ సభలో ప్రకటించడంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టు అయిన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదనీ, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రయివేటుకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
సింగరేణిని ప్రయివేటీకరించబోమని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారని కేసీఆర్ తెలిపారు. అయితే ఎస్సీసీఎల్ కు చెందిన నాలుగు బొగ్గు గనులను వేలం వేయనున్నట్లు కేంద్రం లోక్ సభలో ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీసీఎల్ ప్రయివేటీకరణ వల్ల తెలంగాణపై తీవ్ర ప్రభావం పడుతుందని మంత్రి అన్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వ చర్యలు కక్షసాధింపు చర్యలు అనీ, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని పడగొట్టే కుట్ర అని ఆయన అన్నారు.
థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్సీసీఎల్ అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ ఎఫ్ ) ఉన్న సింగరేణిని కేంద్రం వేలం వేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సింగరేణిని నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (జీఎండీసీ)కు నామినేషన్ పద్ధతిని అనుసరించి పెద్ద సంఖ్యలో లిగ్నైట్ గనులను కేటాయించారని ఆయన చెప్పారు. జీఎండీసీకి లిగ్నైట్ గనులు కేటాయించినందున సింగరేణికి బొగ్గు గనులను ఎందుకు కేటాయించలేదని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.
గుజరాత్ కు ఒక నిబంధన, తెలంగాణకు మరో నిబంధనను అమలు చేయడంలో కేంద్రం పక్షపాతంగా ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బొగ్గు గనుల కేటాయింపు, జీఎండీసీకి ఇచ్చిన పర్యావరణ అనుమతుల ప్రక్రియకు సంబంధించిన పత్రాలను మంత్రి సమర్పించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బొగ్గు గనులు కేటాయించాలని రాష్ట్ర ప్రజలు, ఎస్సీసీఎల్ కార్మికులు పదేపదే చేసిన అభ్యర్థనలను కేంద్రం సానుకూలంగా పరిగణనలోకి తీసుకోలేదని గుర్తు చేశారు.
బొగ్గు గనుల వేలంపై తీవ్రంగా విమర్శలు చేసిన కేటీఆర్.. సింగరేణి బొగ్గు గనులను వేలం వేసే ప్రణాళికతో కేంద్రం ముందుకు వెళితే టిఆర్ఎస్ ఆందోళనలు ప్రారంభిస్తుందని హెచ్చరించారు. సింగరేణిని ప్రయివేటీకరించే కుట్రకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కీలకమైన అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని పార్టీలకు అతీతంగా ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టు అయిన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS ఆరోపించారు. pic.twitter.com/eb0JreBiN3
— TRS Party (@trspartyonline) December 8, 2022