అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై మంగళవారం నాడు హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: Assam CM హిమంత బిశ్వ శర్మపై Hyderabad జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు సోమవారం నాడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి పిర్యాదు ఆధారంగా అసోం సీఎం Himanta Biswa Sarma పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోం సీఎం ఈ నెల 11వ తేదీన రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2016లో పాకిస్లాన్ పై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.ఈ విషయమై హిమంత బిశ్వశర్మ స్నందించారు. రాహుల్ గాంధీ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తనయుడే అని చెప్పడానికి ఆధారాలు అడగలేదు కదా అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు.
అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చారు. మోతీలాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీలు దేశం కోసం సేవ చేశారని ఈ ఫిర్యాదులో కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. 1990 అక్టోబర్ 19న రాజీవ్ గాంధీ హైద్రాబాద్ లో సద్భావన యాత్రను నిర్వహించారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఐపీసీ 153 ఏ, 505(2), 294 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
