రాంప్రసాద్ హత్య: సినిమాను తలపిస్తున్న కోగంటి సత్యం స్కెచ్
వ్యాపారవేత్త రాంప్రసాద్ను హత్య చేయడం నుండి లొంగుబాటు వరకు కోగంటి సత్యం ప్లాన్ ప్రకారంగానే సాగిందని హైద్రాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో కోగంటి సత్యం సహా మరో 8 మందిని పోలీసులు విచారిస్తున్నారు.
హైదరాబాద్: వ్యాపారవేత్త రాంప్రసాద్ను హత్య చేయడం నుండి లొంగుబాటు వరకు కోగంటి సత్యం ప్లాన్ ప్రకారంగానే సాగిందని హైద్రాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో కోగంటి సత్యం సహా మరో 8 మందిని పోలీసులు విచారిస్తున్నారు.
వ్యాపార లావాదేవీల నేపథ్యంలో 2013లోనే రాంప్రసాద్ను కోగంటి సత్యం హత్య చేయాలని భావించినట్టుగా పోలీసులు అనుమానించారు. అప్పట్లో రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు అప్పటి విజయవాడ కమిషనర్ ఈ విషయమై కోగంటి సత్యంను హెచ్చరించినట్టుగా సమాచారం. దీంతో రాంప్రసాద్ను హత్య చేయడం వాయిదా వేసినట్టుగా చెబుతున్నారు.
ఈ నెల 6వ తేదీన రాంప్రసాద్ను పంజగుట్టలో శ్యామ్ సహా మరో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాంప్రసాద్ ను హత్య చేసేందుకు కోగంటి సత్యం ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
సత్యం అనుచరులుగా గుర్తింపు పొందిన శ్యామ్, చోటు, మరో వ్యక్తి నెల రోజుల క్రితమే పంజగుట్టలో ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. శ్యామ్ తో కోగంటి సత్యం మాట్లాడేందుకు పలు సిమ్ కార్డులను ఉపయోగించినట్టుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. సత్యం వాడిన ఐదు సెల్పోన్లను కూడ పోలీసులు సీజ్ చేశారు.
మరో వైపు రాంప్రసాద్ను చంపడం నుండి పోలీసులకు లొంగిపోయే వరకు కూడ కోగంటి సత్యం ప్లాన్ ప్రకారంగానే జరిగాయని పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన మూడు మాసాల్లో బయటకు తీసుకువస్తానని కోగంటి సత్యం శ్యామ్ తో పాటు ఆయన అనుచరులకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ హత్యకు ముందే శ్యామ్ కుటుంబానికి సత్యం రూ. 30 లక్షలు ఇచ్చారని పోలీసులు గుర్తించారు.
రాంప్రసాద్ను హత్య చేస్తే రూ. 70 కోట్లు వస్తాయని సత్యం నిందితులకు ఆశచూపినట్టుగా సమాచారం. శ్యామ్ కుటుంబాన్ని ఆదుకొంటానని సత్యం ఆశ చూపారని అంటున్నారు. రాంప్రసాద్కు ఇతరులతో ఉన్న విభేదాలు, అప్పుల కారణంగానే వారే ఈ హత్య చేసి ఉంటారని నమ్మించేందుకు సత్యం ప్లాన్ చేసినట్టుగా సమాచారం.
రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్కు కూడ ఈ హత్యతో సంబంధం ఉందని నమ్మించే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన శ్యామ్ ఊర శ్రీనివాస్ పేరును పదే పదే ప్రస్తావించారు. రాంప్రసాద్ను హత్య చేస్తే ఊర శ్రీనివాస్ తనకు డబ్బులు ఇస్తానని గతంలో చెప్పినట్టుగా శ్యామ్ మీడియాకు చెప్పారు.
సంబంధిత వార్తలు
రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం భారీ స్కెచ్