అమ్నేషియా పబ్ ఘటన పూటకో మలుపు తిరుగుతుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే బాధితురాలు ఇంకా షాక్‌లోనే ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. 

అమ్నేషియా పబ్ ఘటన పూటకో మలుపు తిరుగుతుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించినట్టుగా వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. వారిలో ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నట్టుగా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పుప్పాలగూడకు చెందిన సాద్దుదీన్ మాలిక్‌(18)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిని (మైనర్‌) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ఎన్టీవీ పేర్కొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన ముగ్గురు (ఉమేర్ ఖాన్, ఇద్దరు మైనర్లు) పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు మూడు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. 

ఇక, బాధితురాలు కోలుకున్న తర్వాత ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేస్తామని డీసీపీ తెలిపారు. ఓ ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయంపై మీడియాలో అనేక రకాలు ఆరోపణలు వస్తున్నాయని శుక్రవారం డీసీపీ తెలిపారు. అయితే.. ఎమ్మెల్యే కొడుకుకు వ్యతిరేకంగా ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదని అన్నారు. విచారణ దశలో ఎక్కడైనా ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉన్నట్లు తేలితే అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తదుపరి విచారణలో ఇంకా ఎవరైనా వ్యక్తుల పాత్ర కనుగొనబడితే.. వారు ఎంతటి వారైనా కేసు నమోదు చేసి, చర్యలు చేపడగామని.. బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు. 

అదే సమయంలో బాధితురాలు, నిందితులు మద్యం సేవించినట్లు కూడా పోలీసులు తోసిపుచ్చారు. ‘‘17 ఏళ్ల అమ్మాయిని ఐదుగురు యువకులు పబ్ నుంచి మొదటగా ఎరుపు రంగు మెర్సిడెస్ కారులో పేస్ట్రీ దుకాణానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బృందం ఇన్నోవా కారులోకి మారిందని.. అందులోనే బాలికపై దాడి జరిగింది’’ అని డీసీపీ తెలిపారు.

అసలేం జరిగింది..
మే 28న జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్ 36లోని అమ్నీషియా పబ్‌లో పార్టీ చేసుకున్న తర్వాత తన కుమార్తెను (మైనర్) గుర్తుతెలియని యువకులు వేధించారని బాధితురాలి తండ్రి మే 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత పోలీసులు విచారణ చేపట్టి.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 (D), POCSO చట్టంలోని 5,6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఇంకా షాక్‌లోనే బాధితురాలు..
బాధితురాలు షాక్‌లోనే ఉందని.. ఆమె నుంచి తదుపరి వాంగ్మూలాలు తీసుకుంటామని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఆమెను భరోసా కేంద్రానికి పరీక్షల నిమిత్తం పంపించి నిపుణులతో కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

హోం మంత్రి మనవడి సంబంధం లేదు..
ఈ కేసులో హోంమంత్రి మనవడు వున్నాడే వార్తల్లో నిజం లేదని పోలీసులు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌లో హోంమంత్రి మనవడు (telangana home minister mahmood ali ) ఎక్కడా లేడని డీసీపీ వెల్లడించారు. ఎమ్మెల్యే కొడుకుకు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యం కాలేదని ఆయన చెప్పారు. అంతకుముందు ఈ ఘటనపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. నిందితులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని.. దర్యాప్తు వేగవంతం చేశారని అలీ అన్నారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించమని హోంమంత్రి స్పష్టం చేశారు. 

అంతకుముందు ఈ కేసులో ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి మొహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ స్పందించారు. అత్యాచార ఘటనతో తనకు సంబంధం లేదని.. ఘటన జరిగిన రోజున తాను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో వున్నానని పుర్ఖాన్ తెలిపారు. తాను ఎవ్వరికీ పార్టీ ఇవ్వలేదని.. వాళ్లు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలు చేసిన వారు నిజానిజాలు తెలుసుకోవాలంటూ పుర్ఖాన్ అన్నారు.