రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు సంబంధించి హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. టెండర్ ప్రక్రియకు మంచి స్పందన వస్తోందని ఆయన అన్నారు.
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు సంబంధించి టెండర్ ప్రక్రియకు మంచి స్పందన వస్తోందన్న హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 13 అంతర్జాతీయ ఇంజనీరింగ్ కంపెనీలతో 5 కన్సార్టియంలు, ప్రీ క్వాలిఫికేషన్లకు బిడ్డింగ్ జరుగుతున్నట్లు చెప్పారు. నెలాఖరులోగా ప్రీ క్వాలిఫైడ్ బిడ్డర్లకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పత్రాలు అందజేస్తామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా.. హైద్రాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశ పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న శంకుస్థాపన చేశారు. రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 31 కి.మీ రూ. 6,250 కోట్లతో ఈ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో 31 నిమిషాల్లో రాయదుర్గం నుండి శంషాబాద్ కు వెళ్లవచ్చు. త్వరగా ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు ఈ మెట్రో రైలు దోహదపడుతుంది. అందుబాటులో ఉన్న అత్యాధునికి టెక్నాలజీని ఈ మెట్రో రైలు నిర్మాణంలో ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ALso REad: రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో పనులు: శంకుస్థాపన చేసిన కేసీఆర్
సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర భూగర్భమార్గంలో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్ పోర్టుకు సమీపంలో ఆకాశ మార్గంలో మెట్రో రైలును అనుమతించే అవకాశం లేదు. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భ మార్గంలో రైలు మార్గం ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణీకులు వెళ్లే రైళ్ల కోసం ఒక లైన్, కార్గో రైళ్ల కోసం మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది.
మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రైవేట్ , ప్రభుత్వ భాగస్వామ్యంతో హైద్రాబాద్ మెట్రో రైల్వే ప్రాజెక్టు తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి. అయితే రెండో దశలో భాగంగా రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు విస్తరించే ప్రాజెక్టు పనుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పర్సస్ వెహికల్ హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ను ఏర్పటు చేసింది. విమానాశ్రయం, మెట్రో లింక్, అభివృద్ది , నిర్మాణం, నిర్వహణను హచ్ఏఎంఎల్ పర్యవేక్షించనుంది.
