మేయర్ ఎన్నిక: టీఆర్ఎస్ కు షాక్, అలక వహించి వెళ్లిపోయిన విజయారెడ్డి
హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. టీఆర్ఎస్ కార్పోరేటర్, పి. జనార్దన్ రెడ్డి కూతురు విజయా రెడ్డి అలక వహించి జిహెచ్ఎంసీ నుంచి వెళ్లిపోయారు.
హైదరాబాద్: హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ కార్పోరేటర్, దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి కూతురు విజయా రెడ్డి అలక వహించారు. విజయా రెడ్డి మేయర్ పదవిని ఆశించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మేయర్ పదవికి రాజ్యసభ సభ్యుడు కే. కేశవ రావు కూతురు గద్వాల విజయలక్ష్మిని ఖరారు చేశారు.
దాంతో విజయారెడ్డి తీవ్రమైన ఆసంతృప్తికి గురై సమావేశం హాల్ బయటకు వెళ్లిపోయారు. డిప్యూటీ మేయర్ పదవికి టీఆర్ఎస్ అధిష్టానం శ్రిలత శోభన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. విజయా రెడ్డి గత ఎన్నికల్లో కూడా మేయరుగా గెలిచారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. దీనికి కొత్త కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరయ్యారు. సభ్యులతో సామూహికంగా ఎన్నికల నిర్వహణ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, తర్వాత ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో ఏదైనా ఒక భాషలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు.
మేయర్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఇందుకు సంబంధించి నిబంధనల ప్రకారం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి హాజరైన 149 మంది కార్పొరేటర్లకు కలెక్టర్ శ్వేతా మహంతి శుభాకాంక్షలు తెలిపారు. మేయర్, ఉప మేయర్ ఎన్నికల ప్రక్రియను కార్పొరేటర్లకు వివరించారు.
అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశాన్ని వాయిదా వేశారు. 12.20 గంటలలోగా కొత్త కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు సమావేశానికి చేరుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అప్పుడు మేయర్, ఉప మేయర్ ఎన్నిక ఉంటుందని ప్రకటించారు.
కాగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఎన్నికల విధులను నిర్వహించే అధికారులు, సెక్యూరిటీ విభాగం, సీపీఆర్ఓ సెక్షన్ల అధికారులు, ఉద్యోగులు మాత్రమే వచ్చారు. మిగతా సిబ్బందికి సెలవు ఇచ్చారు.