మృతిచెందిన టెక్కీల పేరుతో రుణం: ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్
మృతి చెందిన టెక్కీల పేరుతో రుణాలు తీసుకొంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: మృతి చెందిన ఐటీ ఉద్యోగుల పేరుతో రుణాలు తీసుకొన్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్త తరం మోసాన్ని పోలీసులు బయటపెట్టారు.ఈ ముఠాకు సంబంధించిన సమాచారాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ శనివారం నాడు మీడియాకు వివరించారు.
ఇన్సోసిస్లో పనిచేసిన పాలపర్తి రఘురాం పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలను రూ. 2.76లక్షల రుణం పొందినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై బ్యాంకు అధికారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గొట్టిపాడుకు చెందిన నిమ్మగడ్డ ఫణి చౌదరి ఇంటర్మీడియట్ వరకు చదివాడు. ఒంగోలు ఆర్టీఏ కార్యాలయంలో డేటా ఎంట్రీ అడ్మినిస్ట్రేటర్గా పనిచేశాడు. డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఇతర సర్టిపికెట్ల కోసం నకిలీ ఓటరు ఐడీలు, పాన్కార్డులను గురించి తెలుసుకొన్నాడు.
2011లో ఆయనపై నకిలీ వాహన నమోదు పత్రాలు సృష్టించిన కేసులో మాదన్నపేట పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2012 లో సీసీఎస్, 2019 జూన్లో అక్రమ కాల్ రూటింగ్ మోసంలో రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
వేణుగోపాల్, పెడవల్లి శ్రీనివాసరావు, సరూప్నాథ్ చౌదరిలపై కూడ పలు కేసులు ఉన్నాయి. ప్రమాదవశాత్తు మరణించిన ఐటీ ఉద్యోగుల వివరాలను గూగుల్, ఫేస్బుక్ తదితర సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల ద్వారా నిమ్మగడ్డ ఫణి చౌదరి, మండవ స్వరూప్నాథ్ చౌదరిలు సులభంగా తెలుసుకునేవారు.
ఈ సెల్ఫోన్ నంబర్ను సేకరించాక హరీశ్, వేణు గోపాల్ ఫొటోలను ఉపయోగించి శ్రీనివాసరావు నకిలీ ఐడీలు సృష్టించి సెల్ఫోన్ నెట్వర్కింగ్ కేంద్రాల్లో సమర్పించి అదే డూప్లికేట్ సిమ్కార్డును పొందేవారు.
అలా వారి వద్ద రెండు రోజులు సిమ్కార్డు పనిచేస్తున్న సమయంలోనే మృతుడు కస్టమర్గా ఉన్న బ్యాంక్ల నుంచి సంక్షిప్త సమాచారాలు సెల్ఫోన్ నంబర్కు వచ్చేవి. ఆ విధంగా బ్యాంక్ ఖాతాలను గుర్తించేవారు.
ఆ తర్వాత స్వరూప్నాథ్ చౌదరి, హరీశ్లు ఆయా బ్యాంక్లకు వెళ్లి ఏదో ఒక కారణాన్ని సిబ్బందికి చెప్పి మొబైల్తో అనుసంధానంగా ఉన్న ఖాతాలను గుర్తిస్తారు. కస్టమర్ ఐడీ, బ్యాంక్ ఖాతాలను సేకరిస్తారు.నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయి పాస్వర్డ్ను సులభంగా మార్చేవారు.
ఇలా వారికి ఈమెయిల్ ఐడీ తెలియగానే పాస్వర్డ్ను బ్రేక్ చేసి ఆ మెయిల్కు గతలలో వచ్చిన రుణాలు, బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుంటారు. దీని ద్వారా ఈ మెయిల్కు వచ్చిన పాస్ వర్డ్స్ ద్వారా నెట్ బ్యాంకింగ్ కు లాగిన్ అవుతారు.
రుణాల కోసం ధరఖాస్తు చేస్తారు. అలా ఆయా బ్యాంక్ల నుంచి రుణాలు మంజూరు కాగానే ఆ ఖాతా నుంచి వేణుగోపాల్, వీర శంకర్రావుల పేరుమీద తెరిచిన నకిలీ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసేవారు.
ఆ తర్వాత బ్యాంక్లు, ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునేవారు. అలాగే తమ క్రెడిట్ కార్డుల నుంచి క్యాష్ పాయింట్స్లోని వివిధ అకౌంట్లకు బదిలీ చేసుకొని మూడు శాతం కమిషన్ ఇచ్చి డబ్బులు తీసుకునేవారు.
మృతి చెందిన ఐటీ నిపుణుల జీమెయిల్ ఐడీ వివరాలు తెలియకపోతే తాము పొందిన డూప్లికేట్ సిమ్ ద్వారా తమ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ మార్చాలని అభ్యర్థనలు పంపేవారు.మెయిల్ ఐడీ మారిన తర్వాత నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయిన ప్రీ అప్రూవ్డ్ రుణాలు పొందేవారు.
ఈ రకంగా ఈ ముఠా రూ.53,95,043 కొల్లగొట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నయా తరహా చీటింగ్కు ఓ ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.