నేను ఎక్కడికీ వెళ్లలేదు.. సీబీఐ నోటీసులు ఇస్తే సమాధానం చెబుతాను: బొంతు రామ్మోహన్
టీఆర్ఎస్ నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ను తాను ఓ ఫంక్షన్లో కలిశానని చెప్పారు.
టీఆర్ఎస్ నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ను తాను ఓ ఫంక్షన్లో కలిశానని చెప్పారు. శ్రీనివాస్ ఫంక్షన్లో మాత్రమే కలిశాడని.. అతనితో ఎలాంటి లావాదేవీలు లేవని అన్నారు. బొంతు రామ్మోహన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా విస్తృతంగా ప్రచారం సాగింది. బొంతు రామ్మోహన్ మూడు రోజులుగా అందుబాటులో లేరని.. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారనే పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
అయితే ఈ ప్రచారంపై బొంతు రామ్మోహన్ స్పందించారు. హైదరాబాద్లో ఈరోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎక్కడికీ వెళ్లలేదని అన్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ను ఓ ఫంక్షన్లో కలిశాను. తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు నోటీసులు వస్తే తాను సమాధానం చెబుతానని తెలిపారు.
టీఆర్ఎస్ నాయకులను ప్రజల్లో బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. అవసరమైతే జైలుకు పోతామంటే తప్పు చేసినట్టుగా కాదన్నారు. ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసిన చివరకు నిజమే విజయం సాధిస్తుందని అన్నారు. ఆరోగ్యం బాగాలేక తాను ఒక రోజు మొత్తం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్టుగా చెప్పారు. ఒక్కరోజు ఫోన్ స్విచ్చాఫ్ ఉంటే ఈ విధమైన దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు సీబీఐ నోటీసులు ఇవ్వడం గానీ, అరెస్ట్ చేయడం గానీ.. జరగలేదని స్పష్టం చేశారు.