హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. 50 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
హైదరాబాద్ లో మరోసారి మాదక ద్రవ్యాల కలకలం చెలరేగింది. సుమారు రూ.50 కోట్ల విలువైన 25 కిలోల మెఫిడ్రోన్ డ్రగ్ ను రెవెన్యూ ఆఫ్ ఇంటెలీజెన్సీ ,డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ డ్రగ్స్ కలకలం చెలరేగింది. న్యూ ఇయర్ వేడుకలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ డ్రగ్స్ మాఫియా మరింత రెచ్చిపోతుంది. నగరానికి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను రవాణా చేస్తోంది. ఈ క్రమంలో పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. పక్కా సమాచారంతో దాడులు చేస్తూ.. డ్రగ్స్ ముఠాల గుట్టురట్టు చేస్తూ.. వారిని అదుపులోకి తీసుకుంటుంది.
తాజాగా నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.50 కోట్ల విలువైన 25 కిలోల మెఫిడ్రోన్ డ్రగ్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని రెండు రహస్య ల్యాబొరేటరీలను ఛేదించి 25 కిలోల నార్కోటిక్ డ్రగ్ మెఫెడ్రోన్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఖరీదు దాదాపు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. ఇక్కడ పెద్దఎత్తున నార్కోటిక్ డ్రగ్స్ తయారవుతున్నాయి.
సమాచారం ప్రకారం, DRI గత డిసెంబర్ 21 న రెండు రహస్య ప్రయోగశాలలను ఛేదించింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. డ్రగ్ తయారీకి ఉపయోగించిన మెటీరియల్, విక్రయాల ద్వారా వచ్చిన రూ.18.90 లక్షలు, ముడిసరుకు, యంత్రాలు, అక్రమ రవాణాకు ఉపయోగించే వాహనాలను కూడా డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ కార్యకలాపాలకు ప్రధాన సూత్రధారి రూ.60లక్షలతో నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతడిని ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహరంలో అరెస్ట్ అయిన ఏడుగురు పాత నేరస్తులే అని పోలీసుల తెలిపారు.
గంజాయి చాక్లెట్ల కలకలం
మరోవైపు హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. సోమవారం ఆసిఫ్ నగర్ లో గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి.. 31 కిలోల బరువున్న 164 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు బీహార్కు చెందినవాడని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న బృందం చాక్లెట్లు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. 41 ఏళ్ల నిందితుడు బీహార్ నుంచి లేస్డ్ చాక్లెట్లను తీసుకొచ్చి ఒక్కోటి ₹ 20- ₹ 50కి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బీహార్ కు చెందిన మహమ్మద్ జాఫర్ 2015 నుంచి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నాడని, ప్రతి రెండు నెలలకు ఒకసారి బీహార్ వెళ్లి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి హైదరాబాద్ లోని మెహదీపట్నంలో విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు.