తెలంగాణలో గురువారం నుంచి భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం !
Hyderabad: భారత్ జోడో యాత్ర తెలంగాణలో మళ్లీ గురువారం (అక్టోబర్ 27) నుంచి పునఃప్రారంభం కానుంది. మక్తల్లోని 11/22 కెవి సబ్స్టేషన్ నుండి ఉదయం 6.30 గంటలకు యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత రాహుల్ గాంధీ.. కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసే అవకాశముంది.
Bharat Jodo Yatra: మూడు రోజుల విరామం తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర గురువారం (అక్టోబర్ 27న) తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ నుండి తిరిగి ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. భారత్ జోడో యాత్ర అక్టోబరు 23 ఉదయం రాయచూర్ నుంచి కర్ణాటక బయల్దేరి గూడెబెల్లూర్ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించింది. కొద్ది సేపటి తర్వాత ఆదివారం మధ్యాహ్నం నుంచి అక్టోబర్ 26 వరకు మూడు రోజుల పాటు విరామం తీసుకున్నారు.
మక్తల్లోని 11/22 కెవి సబ్స్టేషన్ నుండి ఉదయం 6.30 గంటలకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత రాహుల్ గాంధీ.. కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, బుధవారం సాయంత్రం రాహుల్ గాంధీ రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. పాదయాత్ర గురువారం 26.7 కిలోమీటర్లు పూర్తి చేసి రాత్రికి మక్తల్లోని శ్రీ బాలాజీ ఫ్యాక్టరీ వద్ద ఆగుతుంది. మక్తల్ నుంచి తెలంగాణలో 16 రోజుల పాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 375 కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర కొనసాగి నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది. నవంబర్ 4న మార్చ్కు ఒకరోజు సాధారణ విరామం ఉండనుంది.
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ.. వివిధ వర్గాలకు చెందిన మేధావులు, వివిధ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, క్రీడా, వ్యాపార, సినీ రంగ ప్రముఖులను కూడా కలవనున్నారు. అలాగే, తెలంగాణలోని కొన్ని ప్రార్థనా మందిరాలు, మసీదులు, హిందూ దేవాలయాలను సందర్శించి.. ప్రార్థనలు చేయనున్నారు. ఇందులో సర్వమత ప్రార్థనలు కూడా చేయనున్నట్లు టీపీసీసీ తెలిపింది.
కాగా, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, విధానాలు, ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ.. విభజన శక్తుల నుంచి భారత్ ను ఏకం చేయడానికి భారత్ జోడో యాత్రను చేపట్టినట్టు రాహుల్ గాంధీ పలుమార్లు చెప్పారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. కాంగ్రెస్ పాదయాత్ర కన్యాకుమరి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగనుంది. అంతకుముందు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మీదుగా తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్రను సమన్వయం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన జీవితమే ఒక పోరాటం అన్ని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తే బలం, అది నిఖార్సైన కార్యకర్తలకు భావోద్వేగం కూడిన ఒక సందేశం మాత్రమే అని పేర్కొన్నారు. "బక్క రైతుల గుండె చప్పుడు! బడుగు బ్రతుకుల కొత్త ఆశ ఇప్పుడు మన రాహుల్ గాంధీ.. దేశ రైతులకు మద్ధత్తుగా అన్నదాతకు అండగా భారత్ జోడో యాత్ర ఉద్యమంలో భాగమవ్వండి.. రాహుల్ గాంధీ గారి అడుగులో అడుగేద్దాం! " అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అలాగే, రైతులను అప్పులపాలు చేసి, ఉరి తాళ్ళకు వేలాడించిన పాలకులను కడిగేద్దాం అంటూ పిలుపునిచ్చింది.