కేసీఆర్ ఒక నిరంకుశ నియంత.. బీఆర్ఎస్ పై వైఎస్ షర్మిల ఫైర్
Hyderabad: కేసీఆర్ పార్టీ (బీఎస్ఆర్) అంటే బందిపోటు రాష్ట్ర సమితి అంటూ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు చేస్తామని చెప్పిన ఆమె.. సంక్రాంతి తర్వాత పాదయాత్రను పునఃప్రారంభిస్తానని చెప్పారు.
YRS Telanagana Party (YRSTP) chief YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) నాయకురాలు వైఎస్ షర్మిల మరోసారి అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) బీఆర్ఎస్ పార్టీ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అలాగే, సంక్రాంతి తర్వాత పాదయాత్రను పునఃప్రారంభిస్తానని వైఎస్ షర్మిల తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. బుధవారం నాడు వైఎస్ఆర్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిరంకుశ నియంత అంటూ పేర్కొన్నారు. తన పాదయాత్రకు మరోసారి హైకోర్టు అనుమతినిచ్చిందన్నారు. తన హక్కులను కాలరాయడానికి తెలంగాణ ప్రభుత్వం మితిమీరిన బలప్రయోగం చేస్తోందని షర్మిల ఆరోపించారు. పోలీసు శాఖను కేసీఆర్ ఎంతగానో వాడుకుంటున్నారనీ, అందుకే తన వ్యక్తిగత హక్కులను కాలరాస్తున్నారని ఆమె మండిపడ్డారు.
"ఏదీ అధికారికం కాదు కానీ ప్రతిచోటా పోలీసులు ఉన్నారు, కాబట్టి మీరు దీన్ని ప్రజాస్వామ్యం అని ఎలా అంటారు? ఈ ప్రదేశం చుట్టూ కర్ఫ్యూ ఉంది" అని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ తన రాష్ట్రంలోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారనీ, జాతీయ పార్టీని పెట్టేందుకు వెళ్లే సిగ్గులేకుండా పోతున్నారని ఆమె మండిపడ్డారు. 'హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత పోలీసులు ఎలా నిరాకరిస్తారు?' వైఎస్ షర్మిల తన పాదయాత్రను పునఃప్రారంభించే విషయం గురించి పోలీసులను ప్రశ్నించారు. కేసీఆర్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లోకి రావడానికి పెట్టుకున్న పేరు నిజానికి అది ‘బందిపోట్ల రాష్ట్ర సమితి’ అని షర్మిల అన్నారు. కే. చంద్రశేఖర్ రావు ఒక బందిపోటు అనీ, నేడు దేశంలోనే అత్యంత ధనవంతుడైన బందిపోటు అని ఆమె ఆరోపించారు.
తనను నిరసన స్థలం నుండి ఆసుపత్రికి తరలించినందుకు తెలంగాణ పోలీసుల తీరుపై మండిపడ్డ ఆమె.. వారు తెలంగాణ పోలీసులు కాదు, బీఆర్ఎస్ పోలీసులని విమర్శించారు. తెలంగాణ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. కాగా, ఎస్ఆర్టీపీ నేతలు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత పాదయాత్రకు హైకోర్టు అనుమతినని ఇచ్చింది. తాము అనుమతిని ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు ఎలా షర్మిల పాదయాత్రను నిరాకరించారని హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయ నేతలు పాదయాత్ర కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడ షర్మిల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
తెలంగాణను తాలిబన్ల రాష్ట్రంగా షర్మిల వ్యాఖ్యానించారని ప్రభుత్వ న్యాయవాది గుర్తు చేశారు. రాజ్ భవన్ నుండి బయటకు వచ్చిన తర్వాత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని హైకోర్టు దృష్టికి ప్రభుత్వ న్యాయవాది తీసుకు వచ్చారు. రాజ్ భవన్ వద్ద వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రకు ఎందుకు అనుమతిని ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది.