హైదరాబాద్లో ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ కారు డ్రైవర్ రూ. 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు.
హైదరాబాద్లో ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ కారు డ్రైవర్ రూ. 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. వివరాలు.. మాదాపూర్లోని మైహోం భుజ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న రాధిక నగల వ్యాపారం చేస్తున్నారు. వజ్రాభరణాలు అవసరమైన వారికి కొనుగోలు చేసి సరఫరా చేస్తుంటారు. రాధిక ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఉండే అనూష రూ. 50 లక్షలు విలువ చేసే నగలను ఆర్డర్ ఇచ్చారు. అయితే డెలివరీ చేసే సమయానికి అనూష అపార్ట్మెంట్లో లేరు.
దీంతో అనూషకు కాల్ చేయగా.. మధురానగర్లోని తన బంధువుల ఇంటి వద్ద ఉన్నానని, నగలను అక్కడికి పంపించాలని చెప్పారు. దీంతో అనూష చెప్పిన అడ్రస్కు తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్, సేల్స్మెన్ అక్షయ్తో వజ్రాభరణాలను పంపించారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత సేల్స్మెన్ అక్షయ్ దిగి.. నగలను డెలివరీ చేసేందుకు వెళ్లారు. ఆ తర్వాత డ్రైవర్ శ్రీనివాస్ కారుతో ఉడాయించాడు.
ఈ విషయాన్ని సేల్స్మెన్ వెంటనే రాధికకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో రాధిక వెంటనే ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ కారులో రూ. 7 కోట్ల విలువజేసే ఆభరణాలు ఉన్నాయని.. వాటిని పంజాగుట్టలోని ఓ నగల దుకాణంలో ఇవ్వాల్సి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
