కోహ్లీ ఫోటో వాడినందుకు ఫైన్
తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు గాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోటోను అనుమతి లేకుండా ఉపయోగించినందుకు గాను ఓ సంస్థకు జరిమానా విధించింది ప్రభుత్వం
తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు గాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోటోను అనుమతి లేకుండా ఉపయోగించినందుకు గాను ఓ సంస్థకు జరిమానా విధించింది ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్కు చెందిన శ్రీమాన్ ఫ్యాషన్ క్లాథింగ్ సంస్థ తమ ఉప్పత్తులను పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో క్రికెటర్ విరాట్ కోహ్లీకి యూత్లో ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని భావించింది.
దీనిలో భాగంగా కోహ్లీ ఫోటోలతో ప్రకటనలు ఇచ్చింది. దీనిని ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన విద్యార్థి బి. ఆకాశ్ కుమార్ గతేడాది నవంబర్లో తెలంగాణ వినియోగదారుల వ్యవహారాల విభాగం సలహా కేంద్రంలో ఫిర్యాదు చేశారు.
ప్రకటనపై ఉన్న ఫోటోలను చూసిన వినియోగదారులు కోహ్లీ ఈ వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని భావించి, మోసపోయే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన సలహా కేంద్రం షాపు యాజమాన్యం కోహ్లీ అనుమతి లేకుండా ఆయన ఫోటోలతో ప్రచారం చేస్తున్నట్లుగా గుర్తించి, వారికి రూ.10 వేల జరిమానా విధించింది.
ఈ మొత్తాన్ని ఫిర్యాదు చేసిన ఆకాశ్ కుమార్కు బహుమతిగా ఇవ్వగా... అతను దానిని తిరిగి సలహా కేంద్రానికే ఇచ్చేశారు. మంగళవారం పౌరసరఫరాల భవన్లో రూ.10 వేల చెక్కును అకున్ సభర్వాల్కు అందజేశారు.
ఈ సందర్భంగా అకున్ మాట్లాడుతూ.. సమాజంలో వివిధ రూపాల్లో చోటు చేసుకుంటున్న మోసాలను గుర్తించడంలో వినియోగదారుల పాత్ర కీలకమైనదన్నారు. ఇటువంటి కేసు తమ విభాగానికి రావడం ఇదే తొలిసారని తెలిపుతూ, ఆకాశ్ను ప్రత్యేకంగా అభినందించారు.