Huzurabad Bypoll: దూకుడుపెంచిన ఈటల... బిజెపిలోకి భారీ చేరికలు (వీడియో)
హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక నేపధ్యంలో బిజెపి దూకుడు పెంచింది. మాజీ మంత్రి ఈటల సమక్షంలో పలువురు కాషాయ కండువా కప్పుకుని బిజెపిలో చేరారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో గెలిచి తిరిగి ఎమ్మెల్యే పదవిని చేపట్టాలని పట్టుదలతో వున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఈ క్రమంలో బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల గతంలో తాను పనిచేసిన టీఆర్ఎస్ తో పోరాటం చేస్తున్నారు. అయితే తన అనుచరులు, బిజెపి నాయకులకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి లాగుతుంటే ఈటల గ్రౌండ్ లెవెల్ లో ఈ పని చేస్తున్నారు. ఇలా టీఆర్ఎస్ దూకుడును అంతే దూకుడుగా అడ్డుకుంటున్నారు ఈటల.
గ్రామస్థాయి నాయకులు, సామాన్యులకు దగ్గరవుతున్న ఈటల కాషాయ కండువా కప్పి BJPలో చేర్చుకుంటున్నారు. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం నర్సింహులపల్లి గ్రామస్తులు బిజెపిలో చేరారు. eatala rajender కాషాయ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.
వీడియో
ఇక ఎన్నికల ప్రచారంలోనూ ఇదే దూకుడు ప్రదర్శిస్తున్నారు ఈటల. తనను మంత్రివర్గంనుండే కాదు పార్టీలోంచి అన్యాయంగా బయటకు తోసేశారని... ఆత్మగౌరవం కలిగిన వాడిన కాబట్టి వారితో పోరాటినికి సిద్దమయ్యానంటూ ప్రజలకు వివరిస్తున్నారు. ఇది కేవలం తన ఒక్కడి ఆత్మగౌరవ సమస్య కాదని... హుజురాబాద్ ప్రజలందరి ఆత్మగౌరవ సమస్య అని ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతూ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ లకు కౌంటరిస్తున్నారు.
read more Huzurabad Bypoll: బిజెపిలో కలకలం... హుజురాబాద్ అధ్యక్షుడిపై వేటు
తన అనుచరులు, బిజెపి నాయకులను ప్రలోబాలకు గురిచేసి ఒంటరి చేయాలని చూస్తున్నారని... అయితే తనతో అండగా ప్రజలు వున్నట్లు వారు గుర్తించలేకపోతున్నారని ఈటల అంటున్నారు. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలు, గ్రామస్థాయిలో మంచి పేరున్న నాయకులను బిజెపిలో చేర్చుకుంటున్నట్లు ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ఇక హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి గత శుక్రవారం(అక్టోబర్ 1వ తేదీన) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఇదేరోజు నుండి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా విద్యార్థిసంఘం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ (వెంకట నర్సింగరావు) బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. మిగతా ఇద్దరు కూడా అక్టోబర్ 8నే నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.