Huzurabad Bypoll: ఈటలా... కేసీఆర్ ను పట్టుకుని అరే అంటావా...: మంత్రి కొప్పుల సీరియస్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ తప్పుబట్టారు.
కరీంనగర్: గతంలో ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చినప్పుడు సంతోషపడ్డ ఈటల రాజేందర్ ఇప్పుడు దళిత బందు పథకం తీసుకొస్తే ఎందుకు ఈర్శ్య పడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని బానిస అయితే గతంలో నీవు కూడా బానిసేనా? అని నిలదీశారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను పట్టుకొని ఈటల అరే అనడం దుర్మార్గమన్నారు మంత్రి కొప్పుల.
''ఈ నెల 16న సీఎం కేసీఅర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బందు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు 825 బస్సులను ఏర్పాటు చేసాం. ఒక్కో బస్సుకు ఒక్కో అధికారిని నీయమించాం. అధికార కార్యక్రమం కాబట్టి ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాం. సభకు వచ్చినవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించాం'' అన్నారు.
''హుజూరాబాద్ లో దళిత బందును పైలట్ ప్రాజెక్ట్ గా అమలుచేస్తున్నాం. ఇందుకోసం ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో రెండు వేల కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించాం. సీఎం పాల్గొనే హుజురాబాద్ సభలోనే రెండు వేల మంది లబ్దిదారులకు దళిత బందు చెక్కులను అందజేస్తాం'' అని మంత్రి ప్రకటించారు.
read more Huzurabad Bypoll: గెల్లు చిన్న పిల్లాడే, జానారెడ్డికి పట్టిన గతే ఈటలకు: తలసాని
''దళిత బందు ఒక వినూత్నమైన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో దళితులను ఆర్థికంగా బాగుచేయలనే ఉద్దేశ్యంతో దళిత బందు కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేవలం హుజూరాబాద్ లోనే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా దళిత బందు వచ్చేలా రాబోయే రోజుల్లో చర్యలు చేపడతాం. ప్రతి నియోజకవర్గంలోని దళితులందరికీ ఈ పథకం కింద పది లక్షలు అందుతాయి'' అని మంత్రి తెలిపారు.
''అనాదిగా అణచివేతకు గురయిన దళిత వర్గాల సాధికారత కోసం దళిత బందు పథకాన్ని తీసుకువస్తే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదు. దళిత బంధు పథకాన్ని విమర్శించడం కాదు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం ఇస్తారో చెప్పండి'' అని బిజెపి నాయకులను నిలదీశారు మంత్రి కొప్పుల.