Huzurabad Bypoll: గెల్లు చిన్న పిల్లాడే, జానారెడ్డికి పట్టిన గతే ఈటలకు: తలసాని
మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకుపడ్డారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డికి పట్టినగతే హుజురాబాద్ లో ఈటలకు పడుతుందని హెచ్చరించారు.
హైదరాబాద్: హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను మాజీ మంత్రి ఈటల రాజేందర్ బానిస అనడం భావ్యం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఈటల అహంకారానికి నిదర్శనం అన్నారు. హుజురాబాద్ ప్రజలు ఈటలకు గుణపాఠం చెప్పడం ఖాయమని తలసాని అన్నారు.
''ఈటల ముందు గెల్లు చిన్న పిల్లవాడు కావచ్చు. ఆనాడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడే కదా. ఉద్యమకారులకు టిఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో విద్యార్థి నాయకులు బాల్క సుమన్, గ్యాదరి కిశోర్ లాంటి వాళ్లకు అవకాశం కల్పించింది. ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ కు కూడా అదేవిధంగా కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చారు'' అన్నారు.
''ఈటెల హుజురాబాద్ లో బీసీ... శామీర్ పేటలో ఓసి. నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ నాయకులు జానా రెడ్డికి పట్టిన గతే ఈ ఉప ఎన్నికలో ఈటలకు పడుతుంది. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదు. గతంలో ఆరుసార్లు కేసిఆర్ దయాదాక్షిణ్యాలతోనే ఈటల విజయం సాధించారు'' అని మంత్రి తలసాని మండిపడ్డారు.
Huzurabad bypoll:టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ... ముఖ్య అతిథిగా ట్రబుల్ షూటర్ హరీష్(ఫోటోలు)
టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించడంపై ఈటల స్పందిస్తూ... హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎస్సి వుండాలా బిసి వుండాలా అని కాదు... కేసీఅర్ కు కావల్సింది ఒక బానిస మాత్రమే అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా మంత్రి తలసాని స్పందించారు.
హుజూరాబాద్ లో జరిగే ఉపఎన్నిక కేవలం ఒక సీటు కోసం మాత్రమే కాదని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ఎక్కడ అనేక మంది ఈటలలు తయారై తనను ప్రశ్నిస్తారో అన్న భయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు పట్టుకుందన్నారు. అందుకే ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే హుజూరాబాద్ లో కేసీఅర్ రూ.192 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. ఎది అడిగితే అది ఇవ్వండని ఆదేశించి ఐదుగురు మంత్రులు, పదేసి మంది ఎమ్మెల్యేలను హుజురాబాద్ కు సీఎం పంపించాడని ఈటల అన్నారు.
ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ధీటైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొండా సురేఖ పేరును కాంగ్రెసు నాయకత్వం పరిశీలిస్తోంది. బీసీ సామాజిక వర్గాన్ని రంగంలోకి దించాలనుకుంటే కొండా సురేఖ పోటీ చేసే అవకాశం ఉంది. ఆమె పద్మశాలి సామాజికవర్గానికి చెందినవారు. పైగా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు. పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం శనివారంనాడు కోర్ కమిటీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెసు నాయకత్వం నిర్ణయించింది.