Huzurabad Bypoll: బిజెపికి బిగ్ షాక్... టీఆర్ఎస్ లోకి కరీంనగర్ ఏబివిపి మాజీ కన్వీనర్
హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నేపధ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల నుండి వలసలను మరింత పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా కరీంనగర్ జిల్లా ఏబివిపి మాజీ కన్వీనర్ తిరుపతి టీఆర్ఎస్ లో చేరారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు పావులు కదుపుతున్నారు. కేవలం హుజురాబాద్ లోనే కాదు కరీంనగర్ జిల్లావ్యాప్తంగా బిజెపి నుండి భారీగా వలసలు ఆహ్వానిస్తూ ఈటల రాజేందర్ ను ఒంటరి చేయాలని ఆర్థిక మంత్రి చూస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలామందికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబివిపి) మాజీ జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతిని మంత్రి హరీష్ టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఆదివారం హుజురాబాద్ మండలం సింగాపురంలో హరీష్ ను కలిసిన తిరుపతి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
టీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ... గత 12సంవత్సరాలుగా బిజెపి విద్యార్థి అనుబంధం సంఘమైన ఏబివిపి ద్వారా కాషాయ సిద్ధాంతం కోసం పనిచేశామన్నారు. ఈ సందర్భంలో మంత్రిగా వున్న ఈటల రాజేందర్ అనేకసార్లు అక్రమ కేసులు, అక్రమ అరెస్టు తమపై పెట్టి అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
ఈటల రాజేందర్ సిద్ధాంతాలు, నైతిక విలువలు లేని వ్యక్తి అని మండిపడ్డారు. ఈటల నాయకత్వంలో పనిచేయడం తమకు ఇష్టం లేదన్నారు. కేవలం తన వ్యక్తిగత స్వార్థం, రాజకీయ లబ్ధి కోసమే ఈటల భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగిందన్నారు.
read more తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్... టీఆర్ఎస్ లోకి మల్లన్న టీం సభ్యులు భూమయ్య
భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలుస్తోందని... దీనికి కారణం సిఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లని అన్నారు. ఈ అభివృద్ధికి ఆకర్షితులమై టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని ఆవుల తిరుపతి స్పష్టం చేసారు.
దేవాలయ భూములను కబ్జా చేసిన దగాకోరు ఈటల అని... ఇలాంటి నాయకుడిని కాషాయ సిద్ధాంతంలో చేర్చుకుని జనంలోకి పోవడానికి బిజెపి నాయకులకు సిగ్గుపడాలని మండిపడ్డారు. పార్టీ సిద్ధాంతంలో కాకుండా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈటల రాజకీయం చేస్తున్నారని... కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, కుమ్మక్కు కావడం దారుణమన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
విద్యార్ధి సంఘం నాయకునిగా ఉండి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. పేదరికంలో ఉండి అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులు భరించి... తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి నాయకుని గెలిపించుకునేందుకు కృషి చేస్తామన్నారు. కబ్జాకోరు ఈటల రాజేందర్ ను రాజకీయ సన్యాసం తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఈటల నిజస్వరూపం గురించి వివరిస్తామని... టీఆరెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు వివరిస్తామని తిరుపతి యాదవ్ తెలిపారు.