టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి బిగ్ షాక్... కాంగ్రెస్ పార్టీకి స్వర్గం రవి రాజీనామా
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉపఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి మరో కీలక నాయకుడు రాజీనామా చేశారు.
కరీంనగర్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డిపై మొదటి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నాయకత్వానికి పరీక్షలాంటి హుజురాబాద్ ఉపఎన్నిక వేళ అదే నియోజకవర్గానికి చెందిన కీలక నాయకుడు, ఆర్థికంగా బలం కలిగిన పారిశ్రామికవేత్త ఒకరు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలంగాణ పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేసిన నాయకుడు స్వర్గం రవి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ... తన రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కోరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేకపోతున్నానని... ఈ నెల 30న అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానని స్వర్గం రవి ప్రకటించారు.
read more అతడికే హుజురాబాద్ కాంగ్రెస్ టికెట్... త్వరలోనే ప్రకటన: దామోదర రాజనర్సింహ (వీడియో)
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా రవి కూడా టీఆర్ఎస్ లో చేరనున్నారు. వీరిద్దరూ హుజురాబాద్ టికెట్ ను ఆశించి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ ఇద్దరిలో ఎవరికయినా టీఆర్ఎస్ టికెట్ లభిస్తుందో చూడాలి.
అయితే స్వర్గం రవిని హుజురాబాద్ బరిలో దింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గంతో సుదీర్ఘకాలం అనుబంధం వుండటం... బిసి నాయకుడు కావడమే కాదు ఆర్థికంగానూ బలంగా వుండటంతో అతడివైపే సీఎం మొగ్గుచూపిస్తున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో పాటు తాను చేయించిన సర్వేల్లో కూడా రవికి మంచి మార్కులు పడటంతో ఆయన అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ దాదాపు ఖాయం చేసినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.