అతడికే హుజురాబాద్ కాంగ్రెస్ టికెట్... త్వరలోనే ప్రకటన: దామోదర రాజనర్సింహ (వీడియో)
హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే టీఆర్ఎస్, బిజెపి బరిలోకి దిగగా తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు.
కరీంనగర్: హుజూరాబాద్ పంచాయితీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ది... భారం మాత్రం ప్రజలపై మోపుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. హుజూరాబాద్ లో ఎన్నిక అవసరముందా అని ప్రతి ఒక్కరూ విశ్లేషించుకోవాలి. కేవలం ఒక్క నియోజకవర్గంలో ఉపఎన్నిక కోసం రెండు వేల కోట్ల ప్రజాధనంతో పథకాలా? అని ప్రశ్నించారు. అంతేకాదు రాజకీయ నాయకులను కూడా వెలకట్టి కొనుగోలు చేస్తున్నారని రాజనర్సింహ మండిపడ్డారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇవాళ(బుధవారం) కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ దామోదర రాజనర్సింహ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వస్తే అందరి జీవితాలు మారుతాయని తెలంగాణ ప్రజలు భావించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సోనియా చలువే... ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు.
వీడియో
''కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలహీనంగా లేదు... మా పార్టీకి ఓటమి తెలుసు గెలుపు తెలుసు. కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజలకు జవాబుదారిగా ఉండే నాయకుడి కోసం అన్వేషణ చేస్తున్నాం. త్వరలోనే హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీచేసే అభ్యర్థిని ప్రకటిస్తాం'' అని ప్రకటించారు.
read more కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్టు
''కుట్రల, కుతంత్రాల ముఖ్యమంత్రి ఎవరయినా ఉన్నడాంటే అది కేసీఆరే. దళిత బంధు పేరుతో కేవలం పది లక్షలు ఇవ్వాలని చూస్తున్నారు... ఇలా డబ్బులు కాకుండా గతంలో ఇచ్చిన హామీ మేరకు మూడు ఎకరాల భూమి ఇవ్వు. రూ.50 లక్షలతో మూడెకరాల భూమి కొనివ్వు. దళితులకు మూడెకరాలు ఇవ్వకుంటే తల నారుక్కుంట అంటివి... కానీ మీ తల అట్లనే ఉండే'' అని రాజనర్సింహ ఎద్దేవా చేశారు.
''ఫీజు రియింబర్స్ మెంట్ ఇచ్చి తెలంగాణ యువకులను డాక్టర్లను, ఇంజనీర్లను చేసింది కాంగ్రెస్ పార్టీ. ముస్లిం మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్ లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ కేసీఆర్ మాత్రం లక్షా 92 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయట్లేదు. ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకువచ్చి ప్రభుత్వ యూనివర్సిటీ లు లేకుండా చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ లను అకారణంగా తొలగించారు'' అని ఆందోళన వ్యక్తం చేశారు.
''ఒక కిచకున్ని గత ఏడున్నర సంవత్సరాలుగా తెలంగాణ సమాజం భరిస్తుంది. ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా వున్నపుడు కరోనాను ఎందుకు ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదు... ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదు'' అనిరాజనర్సింహ ప్రశ్నించారు.