హుజురాబాద్ ఉపఎన్నికల వేళ బిజెపికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర వేళ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి కిషన్ రెడ్డి రాజీనామా చేశారు. 

హుజురాబాద్: ఉపఎన్నిక వేళ బిజెపి పార్టీకి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మరో షాక్ తగిలింది. హుజురాబాద్ అసెంబ్లీ బిజెపి ఇంచార్జీ పోరెడ్డి కిషన్ రెడ్డి పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ టీఆర్ఎస్ నుండి బిజెపిలో చేరిన ఈటల రాజేందర్ వ్యవహారశైలి కారణంగానే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కు రాజీనామా లేఖను పంపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తన రాజీనామా లేఖలో సంచలన విషయాలను వెల్లడించారు కిషన్ రెడ్డి. బిజెపి మూల సిద్దాంతాలకు విరుద్దంగా ఈటల వ్యవహరిస్తున్నారని...ప్రధాని మోదీ సిద్దాంతాలను బలపరిచే విధంగా కాకుండ వ్యక్తిస్వామ్య విధానముతో పనిచేస్తున్నారని అన్నారు. బిజెపి బలోపేతానికి కాకుండా కేవలం తన అక్రమ ఆస్తులను కాపాడుకోడానికి ఈటల బిజెపిలోకి వచ్చినట్లు అర్థమువుతుంది అన్నారు. 

read more ఈటలకు బిగ్ షాక్... బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి రాజీనామా, టీఆర్ఎస్ లో చేరిక

ఈటల ప్రస్తుతం చేపట్టిన పాదయాత్రలో కూడా ప్రధాని మోదీ పేరుగానీ, మీ పేరు(బండి సంజయ్) పేరుగాని ఉచ్చరించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా బిజెపి నాయకులు, కార్యకర్తలు మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. బిజెపి కార్యకర్తలు జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేసినా ఈటల అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బిజెపికి చెందిన ద్వితీయ శ్రేణి కేడర్‌పై నిర్లక్ష్యం చేస్తూ కేవలం తన అనుచరులకే ఈటల ప్రాధాన్యం ఇస్తున్నారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి. 

రాజీనామా లేఖ

హుజురాబాద్ బీజేపీ నాయకత్వంపై ఈటల వ్యవహరిస్తున్న తీరుతో ఆత్మగౌరవాన్ని చంపుకోలేకపోతున్నామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన తీరును బిజెపి రాష్ట్ర నాయకత్వం కూడా పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని... అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు పోరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు.