ఈటలకు బిగ్ షాక్... బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి రాజీనామా, టీఆర్ఎస్ లో చేరిక
హుజురాబాద్ లో బిజెపి పార్టీకి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అధికార టీఆర్ఎస్ మరో షాకిచ్చింది. బిజెపి రాాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లేష్ యాదవ్ మంత్రి తలసాని సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంట బిజెపిలోకి వెళ్లిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తిరిగి టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. ఇప్పుడు బిజెపి నాయకులను కూడా టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ ఈటలను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మూడెత్తుల మల్లేష్ యాదవ్ టీఆర్ఎస్ లో చేరారు.
ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ యాదవ్ హుజురాబాద్ బిజెపిలో కీలక నాయకుడు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో మల్లేష్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
read more కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డిపై బదిలీ వేటు: డీజీపీ ఆఫీస్ కు అటాచ్
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని వీడి బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఇప్పటికే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రజా దీవెన పేరిట పాదయాత్ర చేస్తున్న ఆయనకు జమ్మికుంట మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న, ఇల్లందకుంట రామాలయ మాజీ ఛైర్మన్ దేశిని కోటి షాకిచ్చారు. ఈటల బిజెపిలో చేరడంతో ఆయన వెంటే నడిచిన ఈ దంపతులు తాజాగా బిజెపిని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.
హుజురాబాద్ లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాము మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంట నడిచినట్లు దేశిని దంపతులు తెలిపారు. ఇలా బిజెపి పార్టీలో చేరినప్పటికి గెలిచింది మాత్రం టీఆర్ఎస్ కారు గుర్తుపైనే అని అన్నారు. కాబట్టి మా వార్డులో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామన్నారు. ఇకపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు నాయకత్వంలో పనిచేస్తామంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు దేశిని స్వప్న, కోటి దంపతులు.
దేశిని దంపతులు తిరిగి టీఆర్ఎస్ లో చేరడంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రమేయం ఎక్కువగా వున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి తనకు దగ్గరి బంధువులు అయిన దేశిని దంపతులతో రహస్యంగా మంతనాలు జరిపారు. బంధువులు కావడం వల్లే వీరిని కలిసినట్లు మంత్రి చెప్పినా అప్పుడే దేశిని దంపతులు తిరిగి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాయబారం ఫలించి దేశిని దంపతులు టీఆర్ఎస్ లో చేరారు.