Asianet News TeluguAsianet News Telugu

విషాదం: కొడుకు బర్త్ డే వేడుకల్లో తల్లిదండ్రుల సజీవదహనం

 పుట్టినరోజు నాడే తల్లిదండ్రులను కోల్పోయి ఓ చిన్నారిని అనాధగా మార్చాయి. ఇలా చిన్నచిన్న గొడవల కారణంగా ఓ కుటుంబం బలయ్యింది.

husband kills wife in warangal
Author
Warangal, First Published Mar 9, 2021, 10:16 AM IST

వరంగల్: భార్యాభర్తల మద్య మనస్పర్దలు పెరిగి చివరికి ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాయి. అంతేకాదు పుట్టినరోజు నాడే తల్లిదండ్రులను కోల్పోయి ఓ చిన్నారిని అనాధగా మార్చాయి. ఇలా చిన్నచిన్న గొడవల కారణంగా ఓ కుటుంబం బలయ్యింది. ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... వరంగల్ పట్టణంలోని కరీమాబాద్ మిల్స్ కాలనీకి చెందిన బండి భాస్కర్(43)-విజయ(35) దంపతులు 13ఏళ్ల కొడుకుతో కలిసి నివాసముండేవారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో విజయ కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాదు భర్త తనను వేధిస్తున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. దీంతో భాస్కర్ భార్యపై కోపాన్ని పెంచుకున్నాడు. 

ఈ క్రమంలో సోమవారం కొడుకు ఆశ్రిత్ పుట్టినరోజు కావడంతో తల్లి విజయ పుట్టింట్లోనే వేడుకలు ఏర్పాటుచేసింది. ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ భార్యను ఈ వేడుకల్లోనే హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ముందుగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి వచ్చాడు. ఒక్కసారిగా ఒంటికి నిప్పంటించుకుని భార్య విజయను గట్టిగా హత్తుకున్నాడు. దీంతో ఇద్దరూ మంటల్లో దహనమయ్యారు. 

కొడుకు పుట్టినరోజు వేడుకల్లో అందరూ చూస్తుండగానే భార్యాభర్తలు మృతిచెందడంతో విషాదం నింపింది. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios