పలుమార్లు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటమే కాదు ఆత్మహత్యాయత్నం చేసుకునేలా వేధించాడు ఓ కామాంధుడు. 

హైదరాబాద్: కరోనా కారణంగా స్కూళ్లు మూతపడటంతో ఇంటివద్దే వుంటున్న ఓ బాలికపై కన్నేశాడో కామాంధుడు. ప్రేమ పేరిట బాలికను లొంగదీసుకోవాలని ప్రయత్నించినా కుదరకపోవడంతో బలవంతంగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడటమే కాదు ఆత్మహత్యాయత్నం చేసుకునేలా వేధించాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే... జగద్గిరి గుట్ట ప్రాంతంలోని ఎల్లమ్మబండకు ఓ బాలిక(15) తల్లిదండ్రులతో కలిసి అద్దె ఇంట్లో వుంటోంది. అయితే ప్రస్తుతం స్కూళ్లు బంధ్ కావడంతో ఇంటివద్దే వుంటూ ఆన్ లైన్ క్లాసులు వింటోంది. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లిపోగా బాలిక ఇంట్లో ఒంటరిగా వుండేది. 

అయితే గతకొంత కాలంగా బాలికను ఇంటి యజమాని కొడుకు మధుసూదర్ రెడ్డి(27) ప్రేమ పేరిట వేధిస్తున్నారు. కానీ అతడి ప్రేమను బాలిక అంగీకరించడం లేదు. దీంతో ఎలాగయినా ఆమెను లొంగదీసుకోవాలని భావించిన యువకుడు బాలిక ఒంటరిగా వున్న సమయంలో ఇంట్లోకి చొరబడి బలాత్కారానికి పాల్పడ్డారు. దీనిని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ విషయం గురించి ఎవరికయినా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడంతో బాలిక భయపడిపోయి ఎవరికీ చెప్పలేదు. 

అయితే బాలిక మౌనాన్ని అదునుగా తీసుకుని వీడియో చూపించి బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తాజాగా మరోసారి యువకుడు అత్యాచారానికి ప్రయత్నించగా బాలిక ఎదురుతిరిగింది. దీంతో అతడు బెదిరించడంతో తీవ్ర మనోవేధనకు గురయిన బాలిక విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.