మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. వీడియోలో చెప్పిన కాసేపటికే ఇంటికి పోలీసులు
గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి మరోసారి పోలీసులు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు మంగళ్హట్ పోలీసులు .
గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఉదయం 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు మంగళ్హట్ పోలీసులు . 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు. కానీ మధ్యాహ్నం పోలీసులు ఇంటికి భారీగా చేరుకుని రాజాసింగ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, మద్ధతుదారులు భారీగా చేరుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను రాజాసింగ్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
అంతకుముందు రాజాసింగ్ గురువారం నాడు వీడియోను మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు టీఆర్ఎస్, ఎంఐఎంలే కారణమని రాజాసింగ్ ఆరోపించారు. హైద్రాబాద్ లో ఆందోళనలు, విధ్వంసాలు చేస్తున్నవారిని ఎంఐఎం నడిపిస్తుందని ఆయన ఆరోపించారు. తనను జైల్లో పెట్టడంతో పాటు నగర బహిష్కరణ చేసేందుకు కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు
Also Read:పాత కేసుల్లో అరెస్ట్ చేసే కుట్ర: మీడియాకు వీడియో విడుదల చేసిన రాజాసింగ్
మునావర్ షో వద్దని చెప్పినా కూడా ప్రభుత్వం వినలేదని రాజాసింగ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ షో కారణంగానే హైద్రాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయన్నారు. సీతా దేవి,శ్రీరాముడిని దూషించిన మునావర్ సో వద్దని చెప్పినా కూడా ఈ షో ను నిర్వహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించిందని ఆయన విమర్శించారు. ఐదు వేల మందితో ఈ షో ను నిర్వహించారని రాజాసింగ్ ఆరోపించారు. శాంతి భద్రతలు ఎందుకు క్షిణించాయో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.
తాను సోషల్ మీడియాలో గతంలో అప్ లోడ్ చేసిన వీడియోలో మహ్మద్ ప్రవక్త గురించి ప్రస్తావించలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. పాతకేసుల్లో తనను అరెస్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తాను అన్నింటికి సిద్దపడి ఉన్నానని చెప్పారు..పాతబస్తీలో మత ఘర్షణలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు.