వందే భారత్ ఎక్స్ప్రెస్ : ఖమ్మం రైల్వేస్టేషన్లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటా పోటీ నినాదాలు
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు స్వాగత కార్యక్రమం సందర్భంగా ఖమ్మం రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
ఖమ్మం రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు స్వాగత కార్యక్రమం సందర్భంగా స్టేషన్ వద్దకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించివేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇకపోతే.. సికింద్రాబాద్ నుండి విశాఖపట్టణానికి నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసింది. ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఆయన ఈ రైలును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ పండుగ కానుక అని అన్నారు. ఈ రైలు ద్వారా రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి అవకాశం దక్కనుందని మోడీ అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుతో ఎంతో ప్రయోజనం దక్కనుందని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ - విశాఖపట్టణం మధ్య ఈ రైలుతో ప్రయాణ సమయం కూడా తగ్గనుందని మోడీ తెలిపారు. పూర్తిగా దేశీయంగా తయారైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో అనేక ప్రయోజనాలున్నాయని మోడీ చెప్పారు.
Also Read: సికింద్రాబాద్- విశాఖపట్టణం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు: ప్రారంభించిన ప్రధాని మోడీ
ఇవాళ మాత్రం ప్రత్యేక వేళల్లో మాత్రమే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది. రేపటి నుండి వందేభారత్ రైలు రెగ్యులర్ గా సర్వీసులను నిర్వహించనుంది.విశాఖపట్టణం నుండి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 05:45 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 02:15 గంటలకు రైలు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.సికింద్రాబాద్ నుండి విశాఖపట్టణానికి రైలు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. ఈ రైలులో 14 ఏసీ కోచ్ లు ఉంటాయి. 1,128 మంది ప్రయాణీకులను ఈ రైలు తమ గమ్యస్థానాలకు చేర్చనుంది. ఈ రైలులో రెండు ఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్ కారు కోచ్ లున్నాయి.