ఈ నెల 27న ఉద్యోగ సంఘాలతో సీఎస్ భేటీ: పీఆర్సీ, వయో పరిమితి పెంపుపై చర్చ
ఉద్యోగుల వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు, ఇతర సమస్యలపై ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు.
హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు, ఇతర సమస్యలపై ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు.
సోమవారం నాడు టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ను చర్చలకు రావాల్సిందిగా సీఎస్ నుండి ఆహ్వానం అందింది. అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి ఎప్పుడు సమావేశానికి హాజరౌతామో తెలుపుతామని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ కు సమాచారం పంపారు.
వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ నెల 27న త్రిసభ్య కమిటీతో సమావేశమై చర్చలు జరపాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.ఈ నెల 27న చర్చలు విజయవంతంగా ముగిస్తే ఈ నెలాఖరులోపుగా కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీ, ఉద్యోగ విరమణ వయస్సు పెంపుపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
పీఆర్సీపై ఏర్పాటు చేసిన కమిటీ గత ఏడాదిలోనే నివేదికను సమర్పించింది. పీఆర్సీపై ఏర్పాటు చేసిన కమిటీ సోమవారం నాడు తెలంగాణ సచివాలయంలో సమావేశమైంది. ఉద్యోగులకు నిర్ధిష్టకాల వ్యవధిలో ప్రమోషన్లు, వయో పరిమితి పెంపు విషయమై చర్చించారు.