Asianet News TeluguAsianet News Telugu

మొయినాబాద్‌ ఫామ్ హౌజ్‌ కేసు: నిందితులకు హైకోర్టు షాక్, లొంగిపోవాల్సిందే

మొయినాబాద్‌ ఫామ్ హౌజ్‌ కేసులో పోలీసులకు ఊరట లభించింది. ఈ కేసులో నిందితుల రిమాండ్ రిజెక్ట్‌ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది.

high court Verdict on police petition in moinabad farmhouse case Accused Remand
Author
First Published Oct 29, 2022, 12:24 PM IST

మొయినాబాద్‌ ఫామ్ హౌజ్‌ కేసులో పోలీసులకు ఊరట లభించింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో నిందితుల రిమాండ్ రిజెక్ట్‌ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీసు కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేసి అవినీతి నిరోధక శాఖ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. 

ఇక, టీఆర్‌ఎస్‌‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రయత్నాలు జరిగాయనే వార్త తెలంగాణలో సంచలనంగా మారిన సంగతి  తెలిసిందే. ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి‌లు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించి రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

అయితే ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించడానికి ఏసీబీ కోర్టు నిరాకరించింది. దీంతో ఆ తీర్పును సవాలు చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టేసి నిందితులకి రిమాండ్‌ విధించాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల దాకా హైదరాబాద్ సిటీని దాటి వెళ్లొద్దని చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, కోరె నందు కుమార్, డీపీఎస్ కేవీఎన్ సింహాయాజిలు అడ్రస్‌లను పోలీసులకు అందించాలని పేర్కొంది.

ఈ కేసులో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంప్రదించకూడదని తెలిపింది. అలాగే ఇందులో సాక్షులెవరినీ కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను నేటికి (అక్టోబర్ 29) వాయిదా వేసింది.నేడు నిందితులకు రిమాండ్ విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios