కేసీఆర్కు హైకోర్టు షాక్: పంచాయితీ ఎన్నికలకు బ్రేక్
గ్రామపంచాయితీ ఎన్నికల నోటీఫీకేషన్కు హైకోర్టు బ్రేక్
హైదరాబాద్: బీసీల రిజర్వేషన్ల శాతం తేలేవరకు గ్రామ పంచాయితీ నోటీఫికేషన్ ఇవ్వకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నాడు ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్కుమార్తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారించింది.
రెండు మూడు రోజుల్లో గ్రామ పంచాయితీ ఎన్నికల నోటీఫీకేషన్ జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరుణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను ఎలా ఇచ్చారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బీసీల్లోని ఏ, బీ, సీ, డీ లకు రిజర్వేషన్లను తేల్చాలని హైకోర్టు అభిప్రాయపడింది. బీసీల ఓటర్ల శాతాన్ని ఎలా నిర్ధారించారో చెప్పాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
బీసీల రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే ఎన్నికల నోటీఫీకేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.అయితే ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో ప్రస్తావించారు.
రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటీఫీకేషన్ ఇవ్వనున్నట్టు అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ తేలిన తర్వాతే నోటీఫీకేషన్ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు.తదుపరి విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేసింది.