హేమంత్ హత్య: నెల క్రితమే ప్లాన్.. అంతా యుగంధర్ కనుసన్నల్లోనే
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ హేమంత్ పరువు హత్య కేసుకు సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హేమంత్ను చంపేందుకు నెల రోజుల ముందే ప్లాన్ సిద్ధం చేశారు నిందితులు లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ హేమంత్ పరువు హత్య కేసుకు సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హేమంత్ను చంపేందుకు నెల రోజుల ముందే ప్లాన్ సిద్ధం చేశారు నిందితులు లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డి.
గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం వుంటున్న హేమంత్, అవంతిల కిడ్నాప్, మర్డర్కు సంబంధించి యుగంధర్ రెడ్డి రెక్కీ నిర్వహించి ప్లాన్ సిద్ధం చేశాడు. అలాగే అవంతిని ఎలా అయినా తమవైపు తిప్పుకోవాలని లక్ష్మారెడ్డి ప్లాన్ చేశారు.
హేమంత్ మర్డర్కు సంబంధించి నెల కిందటే లింగంపల్లిలోని లక్ష్మారెడ్డి ఇంట్లో మీటింగ్ నిర్వహించారు. జూన్ 10 అవంతి ఇంట్లో నుంచి వెళ్లిపోగా, జూన్ 11న హేమంత్ను పెళ్లి చేసుకుంది.
దీనిని జీర్ణించుకోలేని లక్ష్మారెడ్డి దంపతులు ఇంట్లో నుంచి బయటకు రావడం మానేశారు. సోదరి బాధ చూసిన యుగంధర్ రెడ్డి ఎలాగైనా హేమంత్ నుంచి అవంతిని దూరం చేయాలని నిర్ణయించుకున్నారు.
Also Read:మా అన్నను చంపినవాళ్లను వదలను.. హేమంత్ సోదరుడు
హేమంత్ను చంపేందుకు కిరాయి హంతకులు కృష్ణా, రాజు, పాషాలతో యుగంధర్ పలుమార్లు చర్చలు జరిపారు. ఈలోపు అవంతికి మాయమాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు.
ఈ నెల 24న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హేమంత్ ఇంట్లోకి 12 మంది బంధువులు హేమంత్, అవంతిలపై దాడి చేస్తూ లోపలికి చొరబడ్డారు. అనంతరం ఇద్దరిని కారులోకి బలవంతంగా ఎక్కించారు.
లింగంపల్లిలో మాట్లాడుకుందామని చెప్పి బోపన్పల్లి వైపు తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యంలో అవంతి, హేమంత్ తప్పించుకున్నారు. అవంతి పారిపోగా, హేమంత్ మాత్రం వారికి దొరికిపోయాడు.
రాత్రి 7.30 గంటల సమయంలో నిందితులు కారులోనే హేమంత్ను చంపేశారు. ఈ సీన్లో లక్ష్మారెడ్డి, అర్చన లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ కేసులో మొత్తం 13 మంది బంధువుల హస్తం వున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
మరోవైపు హేమంత్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. బ్రిటన్లో ఉంటున్న హేమంత్ సోదరుడు వచ్చాక అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహం వద్ద తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.
హేమంత్ హత్య కేసులో తన సోదరుడు ఆశిష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోవాలని మృతుడి భార్య అవంతి డిమాండ్ చేశారు. ఈ హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం వున్న ఏ ఒక్కరిని వదలొద్దని ఆమె డిమాండ్ చేస్తున్నారు.