హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అనేక చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది దీంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.
హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అనేక చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది దీంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నీరు చేరడంతో.. చెరువులను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చార్మినార్, మలక్పేట్, బహదూర్పురా, చాదర్ఘాట్లలో హోర్డింగ్స్ కూలిపోయాయి. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, బాబా నగర్, పిస్సల్ బండ, యకుత్పురాలోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉప్పల్, రామంతాపూర్లలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వర్ష బీభత్సం నేపథ్యంలో డిజాస్టర్ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన బృందాలు.. ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. పాతబస్తీలో పలు కాలనీలో నీట మునగడంతో.. ఎమర్జెన్సీ బృందాలు అక్కడి చేరుకున్నాయి. పాతబస్తీ బాబానగర్లో బోట్ల వినియోగించి జలదిగ్భందంలో చిక్కుకున్నవారిని తరలించారు.
- పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
-సూరారం ప్రధాన రహదారిపై వరదనీరు నిలిచిపోయింది.
- డ్రైనేజీలు పొంగిపొర్లడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది పూడికతీత పనులు చేపట్టారు.
-కుషాయిగూడ బస్తీ దవాఖాన వద్ద ఈదురుగాలులకు చెట్టు కూలింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలడంతో వాహనాల రాకపోకలు ఇబ్బంది ఏర్పడింది.
-కంటోన్మెంట్ ప్రాంతంలోని భవానీ ఎన్క్లేవ్లో విద్యుత్ తీగలపై భారీ చెట్టు కూలడంతో.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
-గడ్డి అన్నారం, చైతన్యపురిలో రోడ్లు జలమయం అయ్యాయి.
-సాగర్ రింగ్ రోడ్ కాకతీయ కాలనీలో వరదకు స్కూటీ కొట్టుకొచ్చింది.
-ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
-కూకట్పల్లిలోని పలు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది
ఇక, సికింద్రాబాద్ Sitaphalmandiలో అత్యధికంగా 7.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. వెస్ట్ మారేడ్ పల్లిలో 6.1 సెం.మీ, మల్కాజిగిరిలో 4.7 సెం.మీ. ఎల్బీ నగర్ లో 5.8 సెంమీ. , బన్సీలాల్పేట్లో 6.7సెంమీ, బేగంపేటలోని పాటిగడ్డలో 4.9 సెంమీ. బేగంపేటలోని పాటిగడ్డలో 4.9సెం.మీ వర్షపాతం నమోదైంది. కొత్తపేట, చైతన్యపురి, ఎల్బీనగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ , అమీర్ పేట, చిలకలగూడ,ఉప్పల్, బోయిన్ పల్లి, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
