తెెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇవాళ ఉదయం భారీ వర్షం కురిసింది. విద్యార్థులు స్కూల్ కు, ఉద్యోగులు ఆఫీసులకు, వ్యాపారులు పనులపై బయటకు వెళ్ళే సమయంలో ఈ వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో కురిసిన వర్షానికి లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యారు. నాలాలు పొంగిపొర్లి మురుగు నీరు రోడ్లపైకి చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక లోతట్టుప్రాంతాల్లోని జనావాసాల్లో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తూ ఇళ్ళలోకి చేరింది. ఇలా ఛత్రినాక, శివగంగా నగర్, శివాజీ నగర్ ప్రజలు వరదనీటితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉదయమే ఉరుములు,మెరుపులతో వర్షం మొదలవడంతో పనులపై బయటకు వెళ్ళేవారు ఇబ్బందిపడ్డారు. స్కూళ్లు కూడా తెరుచుకోవడంతో విద్యార్థులను తరలించే వాహనాలు, స్కూల్ బస్సులతో పాటు ఇతర వాహనాలు రోడ్లపైకి రావడం... ఇదే సమయంలో వర్షం కురవడంతో, వరద నీరు రోడ్లపై నిలవడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది. మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయ చౌరస్తా నుండి షేక్ పేట్ వెళ్లే ప్రధాన రహదారి వాహనదారులతో పూర్తిగా స్తంభించింది. మున్సిపాలిటీ ప్రధాన రహదారి సుమారు 4కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇక తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి. వాతావరణ శాఖ జూన్ 8నే రుతుపవనాలు రాష్ట్రాన్ని చేరతాయని అంచనా వేసినా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఐదురోజులు ఆలస్యమయ్యింది. ఈ నెల 13న తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాలు మొదలయ్యాయి.
రుతుపవనాల ఎంట్రీలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే వివిధ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురవడంతో వ్యవసాయ పనులు మొదలయ్యాయి.
ఇక ఈ ఏడాది సాధారణం కంటే మూడు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. దీంతో తెలంగాణలో కూడా ముందుగానే రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని భావించారు. అయితే రుతపవనాల రాక ఆలస్యం కావడంతో.. ఉష్ఱోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. ఈ వేడినుండి తెలంగాణ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ వర్షాలు మొదలయ్యాయి.
