కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ: ఒమిక్రాన్, వరి ధాన్యం కొనుగోలుపై చర్చ
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ తో పాటు వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ కేబినెట్ సమావేశం చర్చిస్తోంది. సోమవారం నాడు తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుంది.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో పాటు, వరి ధాన్యం కొనుగోలు విషయమై చర్చించారు. omicron కరోనా వేరియంట్ పై తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి Harish Rao చైర్మెన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు సభ్యులుగా ఉంటారు.
కరోనా కొత్త రకం ఒమిక్రాన్ వేరియంట్ రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై Telangana Cabinet చర్చించింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పురోగతి, మందుల లభ్యత, ఆక్సిజన్ పడకల సామర్ధ్యం తదితర అంశాలపై కేబినెట్ లో చర్చించారు. కరోనా కొత్త వేరియంట్ పై తమ సన్నద్దతపై వైద్య ఆరోగ్య శాఖ కేబినెట్ కు నివేదికను అందించింది. జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్ , నారాయణ పేట జిల్లాలపై వైద్య ఆరోగ్య శాఖ కేంద్రీకరించాలని సీఎం Kcr వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు.రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఎం కోరారు.
also read:ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం చెప్పినట్టు నిరూపించాలి: కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్
మరో వైపు వరి ధాన్యం కొనుగోలు విషయమై రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి స్పష్టత కావాలని టీఆర్ఎస్ కోరుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ సర్కార్ తీరును బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదనే మనోవేదనతో రైతులు మరణిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ లు ధాన్యం కొనుగోలు విషయమై రాజకీయ లబ్ది కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
వరి ధాన్యం విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై బీజేపీ నేతలు అదే స్థాయిలో ఎదురు దాడికి దిగుతున్నారు. కేంద్ర మంత్రులతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ రెండుపార్టీలపై కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు రోజుల పాటు హైద్రాబాద్ లో వరి దీక్షలు నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు దీక్షలో పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ లో కూడా టీఆర్ఎస్ తన నిరసనను కొనసాగించింది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. మరో వైపు పార్లమెంట్ లో కూడా ఇదే విషయమై టీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. పంజాబ్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా..? అని టీఆర్ఎస్ ప్రశ్నించింది.సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం వినియోగించుకున్న తర్వాత మిగిలిన ధాన్యం ఎఫ్సీఐ తీసుకుంటుందని టీఆర్ఎస్ ఎంపీలు ఈ సందర్భంగా తెలిపారు.