బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ ప్రకటన ప్రత్యర్థుల వ్యాఖ్యలపై కౌంటర్

కేసిఆర్ కాళ్ల దగ్గర బతుకుతున్నావని నన్ను విమర్శిస్తున్నారు. మీరు విమర్శించడం కాదు.. నేనే చెబుతున్నాను.. కేసిఆర్ కాళ్ల దగ్గర ఉండడం నిజంగా నా అదృష్టం.. అని ప్రకటించారు బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బాల్కొండ నియోజకవర్గంలోని కుమ్మర్ పల్లిలో పర్యటన సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. పలు పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు.

స్థానిక మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ ఈరవత్రి అనీల్ కుమార్ చేసిన విమర్శలపై ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సిఎం కాళ్ల దగ్గర పడి ఉన్నందుకే మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ పదవి కొట్టేశావని అనీల్ ఆరోపించారు. దీంతో ప్రశాంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహుల చెంత లేకుండా ఉద్యమ నేతల అడుగుజాడల్లో నడిచినందుకే తాను బాల్కొండ ఎమ్మెల్యేగా గెలిచి బంగారు తెలంగాణ సాధనలో పనిచేస్తున్నానని చెప్పుకున్నారు.

కేసిఆర్ కాళ్ల దగ్గర ఉంటానని చెప్పుకోవడం తనకు గర్వంగా ఉందన్నారు ప్రశాంత్ రెడ్డి. ఉద్యమ నేత కాళ్ల దగ్గర ఉండడాన్ని ఎవరో విమర్శించినా తనకొచ్చే నష్టం లేదని తేల్చి చెప్పారు వేములు ప్రశాంత్ రెడ్డి.