ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సలహా ఇచ్చారు.

హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సలహా ఇచ్చారు. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు టీ. సుబ్బరామిరెడ్డి మనవడి పెళ్లికి వచ్చిన దేవెగౌడ ఆదివారంనాడు ప్రగతిభవన్ లో కేసిఆర్ తోనూ, మంత్రి కేటీఆర్ తోనూ చర్చలు జరిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే కేసిఆర్ ప్రతిపాదనపై ఆ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. లోకసభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి గానీ కాంగ్రెసుకు గానీ పూర్తి మెజారిటీ రాదని, దాంతో ప్రాంతీయ పార్టీల కూటమికి ఆ పార్టీల్లో ఏదో ఒకటి మద్దతు ఇవ్వాల్సి వస్తుందని ఆయన అన్నారుట. 

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సాధారణ ఎన్నికలు ముగిసే వరకు వేచి ఉండాలని దేవెగౌడ కేసిఆర్ కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ తమ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు భిన్నమైనవి అయినందు వల్ల ప్రాంతీయ పార్టీలను ఎన్నికలకు ముందు ఒకతాటికి మీదికి తేవడం సాధ్యం కాదని ఆయన చెప్పినట్లు సమాచారం. 

అందువల్ల ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దేవెగౌడ సూచనతో కేటీఆర్ ఏకీభవించినట్లు తెలుస్తోంది.