అభిమానులకు షాక్.. టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి, రాత్రి 7 గంటలకు నో సేల్స్ : తేల్చిచెప్పిన అజారుద్దీన్
క్రికెట్ అభిమానులకు హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ షాకిచ్చారు. రాత్రి ఏడు గంటలకు టికెట్లను ఆన్లైన్లో పెట్టడం లేదని తెలిపారు. టికెట్లన్నీ అమ్ముడయ్యాయని.. ఎన్ని టికెట్లు అమ్మాము అన్నది రేపు చెబుతామని అజారుద్దీన్ పేర్కొన్నారు.
ఈ నెల 25న జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్కు సంబంధించి జింఖానా గ్రౌండ్లో గురువారం టికెట్లు విక్రయించగా తొక్కిసలాట జరిగింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే రంగంలోకి దిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ను, ఇతర కార్యవర్గ సభ్యులను పిలిపించి మాట్లాడారు. మంత్రి మందలింపుతో హెచ్సీఏ దిగొచ్చిందని... మ్యాచ్కు సంబంధించిన టికెట్లను రాత్రి ఏడు గంటల నుంచి పేటీఎం ఇన్సైడర్ యాప్లో టికెట్లను విక్రయించనున్నట్లుగా ప్రకటించింది. కానీ అజారుద్దీన్ మాత్రం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. మ్యాచ్ టికెట్లన్నీ అయిపోయాయని, ఆన్లైన్లో పెట్టడానికి కూడా లేవని ఆయన తేల్చిచెప్పారు. ఎన్ని టికెట్లు అమ్మాము అన్నది రేపు చెబుతామని అజారుద్దీన్ పేర్కొన్నారు.
అయితే ఇంత జరిగినప్పటికీ అజార్ మాత్రం లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రి, మీడియా ఎదుటే ఆయన వితండవాదం చేశారు. ఇంత పెద్ద మ్యాచ్ జరిగినప్పుడు చిన్నా చితక ఘటనలు జరుగుతాయని ఆజారుద్దీన్ వ్యాఖ్యానించారు. తమ వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని... తమకు మ్యాచ్ నిర్వహణే ముఖ్యమని మంత్రి ఎదుటే రివర్స్ అయ్యారు ఆజారుద్దీన్.
Also REad:ఇలాంటివి సహజం.. మీతో ముచ్చట్లు పెట్టడానికి టైం లేదు : మంత్రి ఎదుటే అజారుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు
అటు టికెట్ల గోల్మాల్ వ్యవహారాన్ని కూడా లైట్ తీసుకున్నారు ఆజారుద్దీన్. ఇవాళ జరిగింది దురదృష్టకర ఘటనేనన్న ఆయన.. మాకు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. మీ దగ్గర కూర్చిన ముచ్చట్లు చెప్పడానికి తనకు టైమ్ లేదని అజారుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను వెళ్లి మ్యాచ్ నిర్వహణ చూసుకోవాలని.. మ్యాచ్ నిర్వహణ అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడినంత తేలిక కాదని అజారుద్దీన్ అన్నారు. ఇంత జరిగినా తమ తప్పు లేదంటున్నారు అజారుద్దీన్.